రైస్ మిల్లర్ల కోసమే కేసీఆర్ ధర్నా చేశారని ఆరోపిస్తూ ఫాంహౌస్లో ఉన్న సీఎంను బటయకు రప్పించింది బీజేపీనే అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. కేసీఆర్ దీక్ష చేయడానికి, ప్రధాని మోడీ సాగు చట్టాలు రద్దు చేయడానికి అసలు ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు.
కేసీఆర్ దీక్ష చేసింది రాష్ట్ర రైతుల కోసమా? పంజాబ్ రైతుల కోసమా ? అంటూ విస్మయం వ్యక్తం చేశారు. ‘ఒకసారి ధాన్యం కొనేది లేదంటడు… ఇంకోసారి కేంద్రమే కొనాలంటడు… ఇప్పుడేమో ప్రతి గింజా నేనే కొంటానంటున్నడు.. అసలేమైంది మా అంకుల్ కు?’ అంటూ సంజయ్ సందేహం వ్యక్తం చేశారు.
`గజనీలా మారిపోయిండు. అపరిచితుడిలా ప్రవర్తిస్తుండు.. ఆయనను అట్లా వదిలేయకండయ్యా…. మంచి డాక్టర్ కు చూపించండి’ అంటూ ఎద్దేవా చేశారు. కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతులు అడిగితే బేడీలు వేసి జైలుకు పంపిన చరిత్ర కేసీఆర్ ది అంటూ సంజయ్ విమర్శించారు.
ఆయనకు నిజంగా రైతులపట్ల చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ప్రకటించి రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని సంజయ్ డిమాండ్ చేశారు. గిరిజనులు పోడు భూముల్లో సాగు చేసుకుంటుంటే మహిళలు, బాలింతలు, పసిపిల్లలని కూడా చూడకుండా లాఠీలతో కొట్టించి, తిండి పెట్టకుండా జైల్లో పెట్టించిన నీచుడు కేసీఆర్.అని విమర్శించారు.
అలాంటి వ్యక్తి గిరిజన రిజర్వేషన్ల గురించి మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు భేష్…. రైతులు తమ పంటను ఎక్కడైనా అమ్ముకునే విధానం బాగుందని కితాబు ఇచ్చిన కేసీఆర్ ఇవాళ తన ధర్నా వల్లే ఆ చట్టాలను రద్దు చేశారని చెప్పుకోవడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని సంజయ్ ధ్వజమెత్తారు.
ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. కేసీఆర్ దీ, ఆయన గురువు చంద్రబాబుది అదే పరిస్థితి అంటూ ఎద్దేవా చేశారు. ధర్నా చౌక్ వద్దన్న కేసీఆర్ అదే ధర్నా చౌక్లో కూర్చున్నారని చెబుతూ రాజకీయ దురుద్దేశంతోనే రైతులు, బీజేపీ నేతలపై రాళ్ల దాడి చేయించారని సంజయ్ మండిపడ్డారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం చెప్పిందా ? లేదా అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు.
కేసీఆర్ ఢిల్లీ వెళ్లి రైతులకు రూ.3లక్షలు ఇస్తారట… మరి తెలంగాణలో చనిపోయిన రైతులకు ఇవ్వరా? అని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని పేర్కొంటూ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని బండి సంజయ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
More Stories
పదేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ 10 లక్షల కోట్లు
మేడిగడ్డ పునరుద్ధరణకు ముందుకొచ్చిన ఎల్అండ్టీ
ఆకట్టుకుంటున్న జై హనుమాన్ పోస్టర్