కరోనా మహమ్మారి కొనసాగిన సమయంలో శ్రీ షిర్డీ సాయి సంస్థానానికి భక్తులరాక తగ్గిపోవడంతో కానుకల ద్వారా వచ్చే కోట్లాది రూపాయల ఆదాయం తగ్గింది. కరోనా మహమ్మారి మొదటి వేవ్లో షిర్డీ సాయిబాబా మందిరం ఎనిమిది నెలలు మూసివేయాల్సి వచ్చింది. అలాగే రెండవ దశలో ఆరు నెలలపాటు ఆలయాన్ని మూసివేయాల్సి వచ్చింది.
దీంతో కరోనా మహమ్మారి రెండు దశలలో మొత్తం 14 నెలలపాటు ఆలయ ద్వారాలు మూసివేశారు. దీంతో శ్రీషిర్డీ సాయిబాబా సంస్థాన్ సుమారు రూ. 300 కోట్ల ఆదాయం కోల్పోయింది. కరోనా మహమ్మారికి ముందు శ్రీ షిర్డీ సాయిబాబాను దర్శించుకునేందుకు ప్రతి రోజు సుమారు 50 నుంచి 60 వేల భక్తులు షిర్డీకి వచ్చేవారు. ఆ సమయంలో హుండీలో భక్తులు కానుకల రూపంలో బంగారం, వెండి, నగదుతోపాటు ఆన్లైన్లో కూడా కానుకలు సమర్పించేవారు.
ఇలా ప్రతిరోజూ సగటున రూ. ఒక కోటి నుంచి రూ. 1.25 కోట్ల వరకు దేవాలయానికి కానుకలు లభించేవి. అయితే లాక్డౌన్ కారణంగా ఆలయం మూసివేయడంతో భక్తులు లేక శ్రీ షిర్డీ సాయిబాబా సంస్థాన్కు భారీ నష్టం వాటిల్లింది. ప్రస్తుతం మళ్లీ అక్టోబర్ ఏడవ తేదీ నుంచి భక్తుల కోసం ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి.
అయితే భౌతికదూరం నిబంధనల దృష్ట్యా ప్రారంభంలో కేవలం 15 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతించినప్పటికీ, ప్రస్తుతం 25 వేల మంది భక్తులు దర్శనం చేసుకునేందుకు అనుమతిస్తున్నారు. కాని వయో పరిమితి నిబంధనతో అనేక మంది భక్తులు తమ వయోవృద్ధులైన తల్లిదండ్రులతోపాటు పదేళ్లలోపు పిల్లలతో సాయిని దర్శించుకునేందుకు వీలులేకుండాపోయింది.
దీంతో అనేక మంది ఇంకా షిర్డీకి రావడంలేదని చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆలయానికి భక్తులు పెరిగితేనే ఖజానా నిండనుందని చెప్పవచ్చు. మరోవైపు దీపావళి పండుగ సెలవులలో మాత్రం కోట్లాది రూపాయలు కానుకల రూపంలో వచ్చాయి. కానీ గత నెల రోజులుగా పరిశీలించినట్టయితే ప్రతి రోజు సగటున కేవలం రూ.35 నుంచి రూ.40 లక్షల కానుకలు మాత్రమే అందుతున్నాయి.
భక్తుల నుంచి కానుకలు తగ్గడంతో షిర్డీసాయి సంస్థాన్పై ఆర్థిక ప్రభావం పడుతోందని తెలుస్తోంది. ముఖ్యంగా సాయిసంస్థాన్లో కాంట్రాక్ట్ కార్మికులతో పాటు పర్మినెంట్ కార్మికుల తో కలిపి మొత్తం సుమారు నాలుగు వేల మంది ఉన్నారు. సంస్థాన్ పరిధిలో రెండు ఆసుపత్రులుండగా వీటిలో ఒక ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందిస్తారు.
అదేవిధంగా సాయిబాబా సూపర్ స్పెషలిటీ ఆసుపత్రిలో స్వల్ప ధరలకే చికిత్స అందిస్తున్నారు. మరోవైపు సాయి ప్రసాదాలయంలో ఉచితంగా భోజనాలు, దర్శనం కోసం క్యూలో ఉండే భక్తులకు ఉచితంగా బూందీ లడ్డు ప్రసాదం ఇస్తారు. అత్యల్ప ధరలకే సాయిభక్తి నివాసాల్లో ఉండేందుకు గదులు.. ఇలా అనేక సౌకర్యాలను షిర్డీ సాయి సంస్థాన్ కల్పిస్తోంది.
జాతీయ విపత్తుల సమయంలో పెద్దఎత్తున షిర్డీ సాయి సంస్థాన్ ఆర్థికంగా ప్రభుత్వానికి సాయం చేస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో కూడా సాయి సంస్థాన్ ఆసుపత్రిలో రోగులకు ఉచిత చికిత్స అందించారు. వీటన్నింటి కోసం సాయి భక్తుల నుంచి కానుకల రూపంలో వచ్చే డబ్బులనే వినియోగిస్తారు. అయితే ఇటీవల కాలంలో మళ్లీ భక్తుల సంఖ్య పెరుగుతోందని, త్వరలోనే మంచి రోజులు వస్తాయని భక్తులందరికీ దర్శనానికి అనుమతి లభిస్తుందని భావిస్తున్నామని మాజీ ట్రస్టీ సచిన్ తాంబే మీడియాకు తెలిపారు.
More Stories
అస్సాంలో ఎఎఫ్ఎస్పిఎ మరో ఆరు నెలలు పొడిగింపు
భారతీయ వాయుసేనలో మరో దేశీయ అస్త్రం
బెంగళూరు కేఫ్ పేలుడు ప్రధాన సూత్రధారి అరెస్టు