ఉగ్రవాదులను పెంచి, పోషించే చరిత్ర పాక్ దే

బద్ర‌తా మండ‌లి స‌మావేశాల్లో క‌శ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ ప్ర‌స్తావించడం పట్ల భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉగ్ర‌వాదుల‌ను పెంచి, పోషించే గ‌త చరిత్ర పాకిస్థాన్‌కు ఉంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే అంటూ ఐక్య‌రాజ్య‌స‌మితి వేదిక‌గా భారత్ మ‌రోసారి పాకిస్థాన్‌కు గ‌ట్టిహెచ్చరిక చేసింది. 
 
భార‌త్‌పై యూఎన్ వేదిక‌గా పాకిస్థాన్ త‌ప్పుడు ప్ర‌చారాలు చేయ‌డం ఇది మొద‌టిసారి కాదని, ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించేందుకు పాక్ అనుచిత వ్యాఖ్య‌లు చేస్తోంద‌ని యూఎన్‌లోని భార‌త కౌన్స‌ల‌ర్ డాక్ట‌ర్ కాజ‌ల్ భ‌ట్ మండిపడ్డారు. కానీ ఆ దేశంలో మాత్రం ఉగ్ర‌వాదులు స్వేచ్ఛ‌గా తిరుగుతున్నార‌ని, సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు, మైనార్టీల‌కు అక్క‌డ ఇబ్బందులు త‌ప్ప‌డం లేద‌ని కాజ‌ల్ ధ్వజమెత్తారు. 
 
పాకిస్థాన్ నుంచి చొర‌బ‌డే ఉగ్ర‌వాదుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆమె స్పష్టం చేశారు. ఉగ్ర‌వాదం, హింస లేని అనుకూల వాతావ‌ర‌ణంలో మాత్ర‌మే అర్థ‌వంత‌మైన చ‌ర్చ‌ల‌కు ఆస్కారం ఉంటుంద‌ని ఆమె తేల్చి చెప్పారు. పాకిస్థాన్‌తో స‌హా అన్ని దేశాల‌తో భారత్  సోద‌ర సంబంధాల‌ను ఆశిస్తోంద‌ని ఆమె పేర్కొన్నారు.
ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే, అవి ద్వైపాక్షిక‌మైనా, సిమ్లా అగ్రిమెంట్‌, లాహోర్ డిక్ల‌రేష‌న్ లాంటి వాటిపైన కూడా శాంతియుతంగా చ‌ర్చించ‌నున్న‌ట్లు కాజ‌ల్ భ‌ట్‌ తెలిపారు. అయితే  చ‌ర్చ‌ల‌కు అనుకూల‌మైన వాతావ‌ర‌ణాన్ని ఏర్పాటు చేసే బాధ్య‌త‌ పాకిస్థాన్‌పైనే ఉంటుంద‌ని ఆమె స్పష్టం చేశారు. అప్ప‌టి వ‌ర‌కు సీమాంత‌ర ఉగ్ర‌వాదం ప‌ట్ల భార‌త్ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని చెప్పారు.
 
అంత‌ర్జాతీయ శాంతి అంశంపై పాకిస్థాన్ రాయబారి మునిర్ అక్ర‌మ్ మాట్లాడుతూ క‌శ్మీర్ స‌మ‌స్య‌ను లేవ‌నెత్తడంతో జ‌మ్మూక‌శ్మీర్‌కు చెందిన కాజ‌ల్ భ‌ట్ చాలా తీవ్ర‌స్థాయిలో పాక్‌కు స‌మాధానం ఇచ్చారు.  యూఎన్ భ‌ద్ర‌తా మండ‌లి నిషేధించిన ఉగ్ర‌వాదుల్లో ఎక్కువ మంది పాక్‌లో ఉన్న‌ట్లు కాజ‌ల్ ఆరోపించారు. అక్రమంగా ఆక్ర‌మించిన ప్రాంతాల నుంచి పాక్ వీలైనంత త్వ‌ర‌గా వెళ్లిపోవాల‌ని ఆమె పాకిస్థాన్ కు హితవు చెప్పారు.