బాలింతల్లోనూ కరోనా యాంటీబాడీలు!

కరోనా నుండి కోలుకున్న లేదా వ్యాక్సిన్‌ తీసుకున్న బాలింతల్లోనూ యాంటీబాడీలు క్రియాశీలంగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. అయితే, ఈ యాండీబాడీలు వైరస్‌ నుండి చిన్నారులకు రక్షణ కల్పిస్తాయా లేదా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 

ఈ అధ్యయనం వివరాలు అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనలో భాగంగా 77మంది బాలింతల నుండి నమూనాలను సేకరించినట్లు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ రొచెస్టర్‌ మెడికల్‌ సెంటర్‌ (యుఆర్‌ఎంసి)కు చెందిన బ్రిడ్జెట్‌ యంగ్‌ తెలిపారు. 

వీరిలో 47మంది వ్యాధి బారిన పడిన వారు కాగా, వ్యాక్సిన్‌లు తీసుకున్న వారు 30 మంది ఉన్నారని తెలిపారు. ఇన్‌ఫెక్షన్‌ నుండి కోలుకున్న తల్లుల్లో వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు అధిక స్థాయిలో ఉన్నట్లు గుర్తించామని చెప్పారు.  అలాగే వ్యాక్సిన్‌ తీసుకున్న తల్లుల్లోనూ అదే స్థాయిలో రోగనిరోధక ప్రతిస్పందనలు ఉన్నట్లు కనుగొన్నట్లు తెలిపారు. 

ఈ రెండు విధాల్లో ఉత్పత్తి అయిన యాంటీబాడీలు కరోనా వైరస్‌ను నిర్వీర్యం చేస్తున్నాయని చెప్పారు. వైరస్‌ నుండి కోలుకున్న వారు, వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో యాంటీబాడీలు మూడు నెలల పాటు ఉంటున్నాయని వెల్లడించారు.  అయితే, ఈ కరోనా యాంటీబాడీలు చిన్నారులకు వైరస్‌ నుండి రక్షణ కలిగిస్తాయా లేదా అనే విషయం ఇంకా నిరూపితం కాలేదని పేర్కొన్నారు.