హుజురాబాద్ కాగానే కేసీఆర్‎కు రైతులు గుర్తుకొచ్చారా?

హుజురాబాద్ ఎన్నిక కాగానే కేసీఆర్‎కు రైతులు గుర్తుకొచ్చారా? అని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రశ్నించారు.  ధాన్యం కొనాలని టీఆర్ఎస్ ధర్నాలు చేయడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.  టీఆర్ఎస్ ధర్నాలు ఎవరి మీద? హుజురాబాద్ లో ఓడగొట్టిన ప్రజలు, రైతుల మీద చేస్తుందా?  అంటూ ప్రశ్నించారు.
ధర్నాల మీద కాకుండా.. ఉద్యోగాల భర్తీ మీద దృష్టి పెడితే బాగుంటుందని హితవు చెప్పారు. ఇది కల్వకుంట్ల కుటుంబం సమస్య కాదు.. రైతుల సమస్య అంటూ ఎద్దేవా చేశారు.  . కేంద్ర రైతులకు ఎక్కడ అన్యాయం చేసిందో చెప్పాలని కిషన్ రెడ్డి సవాల్ చేశారు. ధాన్యం కొనుగోళ్లకు ఇచ్చే ప్రతి పైసా కేంద్రానిదే అని తేల్చి చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం మేరకే కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని ఆయన తెలిపారు. ధర్నా చౌక్ అవసరం లేదన్న వాళ్ళే ధర్నాలు చేయటాన్ని ప్రజలు గమనిస్తున్నారని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ ఢిల్లీ వచ్చి కేంద్రంతో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. 
బాయిల్డ్ రైస్ తో కేంద్రానికి సంబంధం లేదని పేర్కొంటూ  బాయిల్డ్ రైస్ కొనేదిలేదని మూడేళ్లుగా చెబుతూనే ఉన్నామని గుర్తు చేశారు. అయితే మూడేళ్ల నుంచి కూడా కేసీఆర్ కోసం కాదు.. రైతుల కోసమే బాయిల్డ్ రైస్ కొంటున్నామని చెప్పారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తామని తెలంగాణ చెప్పింది. ఆ తర్వాత 90 లక్షలు మెట్రిక్ టన్నులు పంపుతామని, మరోసారి 108 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని లేఖ రాశారని కేంద్ర మంత్రి వివరించారు. అయితే ఈ ఏడాది 26 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొంటామని స్పష్టం చేశారు.

ప్రతి ఏటా జాతీయ గిరిజన దినోత్సవం

స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా గిరిజనులకు సరైన గుర్తింపు లభించడం లేదని కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్‎లో భాగంగా కేంద్ర మంత్రివర్గం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. స్వాతంత్యం కోసం పోరాడింది ఎక్కువగా గిరిజనులే అంటూ వారిలో భగవాన్ బిర్సా ముండా ఒకరని, ఆయన జన్మదినం నవంబర్ 15 సందర్భంగా ఆ రోజును గిరిజన జాతీయ గౌరవ దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
ఆ రోజు దేశవ్యాప్తంగా గిరిజన సోదరులంతా కూడా వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టాలని అంటూ ఈ నెల 15 నుంచి 22 వరకు దశల వారీగా ఈ కార్యక్రమం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 15న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ గిరిజన దినోత్సవాన్ని నిర్వహించాలని కోరారు.
బిర్సా ముండా బతికింది 25 సంవత్సరాలే అయినా.. బ్రిటీష్ వాళ్లతో వీరోచితంగా పోరాడి జైలులో అనుమానాస్పదంగా మృతిచెందారని గుర్తు చేశారు.  ఆయన చనిపోయిన రాంఛీ జైలును కేంద్ర ప్రభుత్వం మ్యూజియంగా మార్చిందని అంటూ అందులో భాగంగా ఆ ట్రైబల్ మ్యూజియంను ప్రధాని నరేంద్ర మోదీ  నవంబర్ 15న ప్రారంభించనున్నారని తెలిపారు.
అదేరోజు మధ్యప్రదేశ్ లో 2 లక్షల మంది గిరిజనులతో నిర్వహించే జాతీయ గిరిజన దినోత్సవంలో ప్రధాని మోదీ  పాల్గొంటారని చెప్పారు.  అంతేకాకుండా.. బిర్సా ముండా జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణలో కూడా ఒక ట్రైబల్ మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం నిర్ణయించిందని వెల్లడించారు. అందుకోసం కేంద్రం రూ. 15 కోట్లు విడుదల చేయనుందని చెప్పారు.
ఈ నిధులతో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో త్వరగా ట్రైబల్ మ్యూజియాన్ని ఏర్పాటుచేయాలి. దీనికోసం ఇప్పటికే రూ. కోటి విడుదల కూడా అయ్యాయి. అయినా కూడా పనులు ఇంకా మొదలుకాలేని విచారం వ్యక్తం చేశారు. కేంద్రం నిధులకు తోడుగా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో రూ. 3 కోట్లు ఇస్తామని తెలిపింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని ఆయన కోరారు.