జల వివాదంపై కేసీఆర్ ఆరోపణలు పెద్ద డ్రామా

 ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకాల విషయంలో ఇటీవల కేసీఆర్‌ చేసిన ఆరోపణలు పెద్ద డ్రామా అని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్  మండిపడ్డారు. రెండు రాష్ట్రాలను సంప్రదించిన తరువాతే కేఆర్‌ఎంజీ, జీఆర్‌ఎంబీలను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగానే కేంద్రాన్ని అప్రదిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

ప్రాజెక్టుల అప్పగింతపై  గెజిట్‌లో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.కృష్ణా జలాలపై ప్రత్యేక ట్రైబ్యూనల్‌ ఏర్పాటులో జాప్యానికి తెలంగాణ ప్రభుత్వమే కారణమని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మీడియా సమావేశంలో తన పేరు ప్రస్తావిస్తూ చేసిన వాఖ్యల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

కేసీఅర్ మాటలు ప్రజాస్వామ్యన్ని అపాస్యం చేసేలా మాట్లడారని ధ్వజమెత్తారు. కేసీఆర్ బాధ్యత గల పదవిలో ఉండి ఇలా మాట్లాడటం మంచిది కాదని ఆయన హితవు చెప్పారు. మాట్లాడే ముందు ఒకసారి అలోచించి మాట్లాడుతే మంచిదని కేంద్ర మంత్రి సూచించారు.

ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకాల కోసం కొత్త ట్రైబ్యూనల్‌ ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేసినట్లు ఆయన గుర్తు చేశారు. 2015లో కొత్త ట్రిబ్యునల్ ఎర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందని ఆయన గుర్తు చేశారు. కోర్టులో కేసు ఉన్నందున తాము నిర్ణయం తీసుకోలేమని చెప్పినట్లు తెలిపారు.

అపెక్స్ కౌన్సిల్ సమావేశంను తాను  2020లో నిర్వహించగా, రెండు రోజుల్లో పిటిషన్‌ వెనక్కి తీసుకుంటామని కేసీఆర్‌ 2020 అక్టోబర్‌ 6న చెప్పారని పేర్కొన్నారు. కానీ ఎనిమిది నెలల వరకు పిటిషన్‌ వెనక్కి తీసుకోలేదని కేంద్ర మంత్రి వెల్లడించారు. 

నెల క్రితమే పిటిషన్‌ ఉపసంహరణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని చెబుతూ ఏడేళ్లు ఆలప్యం కావడానికి తాము, కేంద్రం ఎలా బాధ్యత వహిస్తుందని షెకావత్  ప్రశ్నించారు. కొత్త ట్రిబ్యునల్ కోసం ఇప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టామని, న్యాయపరమైన అభిప్రాయం కోసం న్యాయ శాఖకు లేఖ రాశామని చెప్పారు. 

కొత్తది ఏర్పాటు చేయాలా లేక పాత దాన్నే కొనసాగించాలా అన్నది నిర్ణయం జరగాల్సి ఉందని తెలిపారు. ట్రైబ్యూనల్‌ ఏర్పాటులో జాప్యానికి తెలంగాణ ప్రభుత్వమే కారణమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రుల సమ్మతితోనే అవసరమైతే ట్రిబ్యునల్ ఏర్పాటు జరుగుతోందని కూడా చెప్పారు. 

కాగా , ఇద్దరు ముఖ్యమంత్రుల అంగీకారం తరువాతనే  బోర్డుల పరిధి నిర్ణయించామని ఆయన తెలిపారు. నోటిషికేషన్‌పై ఎలాంటి వివాదాలు లేవని ఆయన చెప్పారు.  విద్యుత్ ప్రాజెక్ట్ ల నిర్వహణ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని నోటిఫికేషన్ లో పూర్తి స్పష్టత ఉంకదని షెకావత్ స్పష్టం చేశారు.