ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదని, ‘ఐ నీడ్ కమిషన్’ అని బిజెపి ఎద్దేవా చేసింది. రఫేల్ ఒప్పందంలో ప్రమేయమున్న దళారులకు 2007 నుంచి 2012 మధ్య ముడుపులు ముట్టాయని ఫ్రాన్స్ పత్రిక ఆరోపించిన నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా బీజేపీ నేత సంబిట్ పాత్ర విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఈ కుంభకోణం జరిగిందని తాజాగా వెల్లడైందని పేర్కొంటూ పదేండ్ల కిందట జరిగిన ఈ వ్యవహారం ఒప్పందం కోసం కాదని కమిషన్ల కోసమని ఆరోపించారు. కొనుగోలు కోసం ఒప్పందం మనం చూడలేదని, దళారులకు 40 శాతం కమిషన్ చెల్లించేలా ఒప్పందం జరిగిందని బీజేపీ నేత ధ్వజమెత్తారు.
ఈ అవినీతి చిరునామా 10 జన్పధ్ అని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ చిరునామా అనాధగా మారిందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధికార నివాసాన్ని ప్రస్తావిస్తూ సంబిట్ పాత్ర దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం ఇటలీలో ఉన్నట్లుందని, యూపీయే ప్రభుత్వ హయాంలో ఈ అవినీతి ఎలా జరిగిందో ఆయన ఆ దేశం నుంచి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
భారత వాయు సేనకు యుద్ధ విమానాల అవసరం ఉండగా, ఈ ఒప్పందాన్ని పదేళ్ళపాటు పెండింగ్లో పెట్టారని దుయ్యబట్టారు. ముడుపులలో కొత్త విధించిన కారణంగానే యుపిఎ హయాంలో ఈ ఒప్పందం ఖరారు కాలేదని ఆయన ఆరోపించారు.
2019 సాధారణ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, రఫేల్ ఒప్పందం గురించి తప్పుడు వాతావరణం సృష్టించడానికి చేసిన ప్రయత్నాలను మనమంతా గమనించామని చెప్పారు. అటువంటి వాతావరణం వల్ల రాజకీయంగా ప్రయోజనం పొందవచ్చునని ఆ పార్టీలు భావించాయని పేర్కొన్నారు.
నేడు తాను చాలా ముఖ్యమైన పత్రాలను ప్రజల ముందు ఉంచుతున్నానని చెప్పారు. అవినీతి ఏ ప్రభుత్వ హయాంలో జరిగిందో ఈ పత్రాలు వెల్లడిస్తాయని తెలిపారు. రఫేల్ ఒప్పందంలో అవినీతి జరిగిందని ఫ్రెంచ్ మీడియా వెల్లడించిందని గుర్తు చేశారు. ఈ వ్యవహారమంతా 2007-2012 మధ్య కాలంలో జరిగిందని చెప్పారు.
2019 సాధారణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా నిరాధార ఆరోపణలతో అనేక పత్రికా సమావేశాలను నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. ఫ్రాన్స్ మీడియాలో ప్రచురితమైన ఓ కథనంలో డసాల్ట్ ఏవియేషన్ చెల్లించిన 7.5 మిలియన్ యూరోలు (దాదాపు రూ.65 కోట్లు) కమిషన్ గురించి పేర్కొన్నారని తెలిపారు.
ఎస్ఎం గుప్తాకు గరిష్ఠంగా 11 మిలియన్ యూరోలు కమిషన్గా చెల్లించినట్లు ఈ కథనం పేర్కొన్నట్లు తెలిపారు. అగస్టా వెస్ట్ల్యాండ్ కేసులో కూడా గుప్తా పేరు వెలుగులోకి వచ్చిందని చెప్పారు. ఇది కేవలం ఓ యాధృచ్ఛిక సంఘటన కాదని, కుట్ర దాగుందని అంటూ దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాల్సిందే అని స్పష్టం చేశారు.
More Stories
శుక్రవారం రెండో విడత పోలింగ్ కు రంగం సిద్ధం
ఎన్నికల ప్రసంగం మధ్యలోనే స్పృహ తప్పిన గడ్కరీ
ఢిల్లీ లిక్కర్ కేసులో క్విడ్ ప్రోకో