ఈ కేసుల్లో సీబీఐ తరఫు న్యాయవాది సురేందర్ వాదనలు వినిపించారు. ‘‘జగతి సంస్థలో జగన్ రూపాయి పెట్టుబడి పెట్టకుండానే ఇతరులతో రూ.1246 కోట్లు పెట్టుబడిగా పెట్టించారు. ఇందుకోసం తండ్రి అధికారాన్ని ఉపయోగించుకున్నారు. ఈ విషయంలో జగన్, విజయసాయిరెడ్డి ప్రణాళిక ప్రకారం, కుట్రపూరితంగా వ్యవహరించారు” అని పేర్కొన్నారు.
పైగా, తండ్రి అధికారం ద్వారా హెటిరో తదితర కంపెనీలకు లబ్ధి చేకూర్చి, వారిచ్చే ముడుపులనే జగన్ తన సంస్థల్లోకి పెట్టుబడులుగా మళ్లించారని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ స్వయంగా ధ్రువీకరించిందని, హెటిరో హెల్త్కేర్లో జరిపిన తనిఖీల్లో ఈ పెట్టుబడులకు సంబంధించిన వివరాలు బయటపడ్డాయని వెల్లడించారు.
వైఎస్ సర్కారు భూములు కేటాయించడం, ఆ భూములు పొందిన వారు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం! అప్పట్లో జరిగిన ‘క్విడ్ప్రొకో’ ఇదేనని సీబీఐ ఇప్పటికే తేల్చింది. అయితే పిటిషనర్లు భూకేటాయింపులు వేరు, పెట్టుబడులు వేరు అని భ్రమింపజేస్తున్నారని, రెండింటినీ కలిపి చూడాలని సీబీఐ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అప్పుడే అసలైన కుట్ర బయటపడుతుందని వివరించారు.
పెట్టుబడులకు సంబంధించి హెటిరో సంస్థ నిర్ణయాలకు, ఎండీ శ్రీనివాస్ రెడ్డికి సంబంధం లేదని వాదించడం సరికాదని తెలిపారు. ‘‘శ్రీనివాస్ రెడ్డి కీలకమైన పాత్ర పోషించడం వల్లే హెటిరో సంస్థ పెట్టుబడుల నిర్ణయం తీసుకుంది. దీనికి బలమైన ఆధారాలు ఉన్నాయి” అని తెలిపారు.
పైగా, పెట్టుబడులకు సంబంధించిన షరతుల్లో జగతి పబ్లికేషన్స్ వాటాలను ఇతరులకు విక్రయించరాదని, కేవలం వాటాదారులు, కుటుంబ సభ్యులకే విక్రయించాలని ఉందని గుర్తు చేశారు. వాటాలు విక్రయించడానికి వీలులేకుండా, పెట్టిన పెట్టుబడిపై ఇప్పటివరకు ఎటువంటి లాభం రాకుండా ఎవరైనా పెట్టుబడి పెడతారా? అని సీబీఐ న్యాయవాది సురేందర్ ప్రశ్నించారు.
జగతి పబ్లికేషన్స్లో జగన్ కేవలం రూ.73 కోట్లు పెట్టుబడి పెట్టి 70 శాతం వాటా తీసుకున్నారని, రూ.1173 కోట్లు పెట్టిన ఇతర సంస్థలకు కేవలం 30 శాతం వాటా మాత్రమే దక్కిందని తెలిపారు. జగన్ పెట్టిన రూ.73 కోట్లు సైతం కార్మెల్ ఏషియా, సండూర్ పవర్ కంపెనీల నుంచి వచ్చాయి. అంటే ఈ లెక్కన జగన్ ఒక్క రూపాయి కూడా పెట్టకుండా రూ.1246 కోట్లు పెట్టుబడులు తెచ్ఛిన్నట్లే అని పేర్కొన్నారు.
నేరం జరిగిందనడానికి సీబీఐ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని తెలుపుతూ, పూర్తిస్థాయి విచారణ మొదలైతే నేరం నిరూపిస్తాం అని తెలిపారు. స్పష్టంగా ‘లింకు’.. ఇన్నేళ్లయినప్పటికీ కేసుల విచారణ ఇంకా డిశ్చార్జి పిటిషన్ల వద్దే ఉందని సీబీఐ న్యాయవాది తెలిపారు. హెటిరో పెట్టుబడిని సమర్థించుకోవడానికి తప్పుడు తేదీతో
విజయసాయిరెడ్డి డెలాయిట్ సంస్థ నుంచి వాల్యుయేషన్ రిపోర్ట్ తెప్పించారని ఆరోపించారు. హెటిరో భూకేటాయింపునకు.. జగన్ సంస్థల్లో పెట్టుబడుల ప్రవాహానికి స్పష్టమైన లింకు ఉందని వాదించారు. జగన్ సంస్థల్లో హెటిరో 2006, 2007లో రెండు దఫాలుగా పెట్టుబడి పెట్టిందని, అదే సమయంలో ఆ సంస్థకు వైఎస్ ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించిందని తెలిపారు.
2008లో మరోసారి పెట్టుబడి పెట్టాకే భూకేటాయింపు 75 ఎకరాలకు చేరిందని తెలిపారు. ఈ వ్యవహారంలో హెటిరో ఎండీ శ్రీనివాస్ రెడ్డి కీలకపాత్ర పోషించారు కాబట్టే ఆయనను నిందితుడిగా చేర్చామని స్పష్టంచేశారు. హెటిరో డైరెక్టర్లందరూ నిందితులని తాము చెప్పడం లేదని పేర్కొన్నారు.
నిబంధనల మేరకే చార్జిషీట్ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించిందని.. తప్పు జరిగినట్లు అన్ని రుజువులు ఉన్నందున పిటిషన్లను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐ వాదనలకు తాము సమాధానం చెబుతామని హెటిరో తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి హైకోర్టుకు తెలిపారు.
More Stories
తెలుగు భాషను బతికించుకోవాలి
కాంగ్రెస్ పార్టీకి రూ.1823 కోట్ల ఐటీ నోటీసు
టీడీపీ తుది జాబితా విడుదల