టీఆర్ఎస్ సభకు రైతుల అభ్యంతరాలు బేతఖార్ 

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఈ నెల 29న  తలపెట్టిన ‘‘విజయ గర్జన’’ సభకు భూములు ఇచ్చేందుకు రైతులు ససేమిరా అంటున్నారు. వారి అభ్యంతరాలను ఖాతరు చేయకుండా  టీఆర్‌ఎస్‌ నేతలు, రెవెన్యూ అధికారులు, కుడా అధికారులతో సర్వేలు చేయిస్తుండడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఒక్క రోజు సభ కోసం వందల ఎకరాల్లో పొలాలు పాడు చేయొద్దంటూ రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా టీఆర్ఎస్​నేతలు ఖాతరు చేయడం లేదు. హనుమకొండ జిల్లా హసన్​పర్తి మండలం దేవన్నపేటలో సభ నిర్వహణకు అవసరమైన పనులను శనివారం షురూ చేశారు. 

పంట పొలాల్లో సభ నిర్వహించవద్దంటూ దేవన్నపేట రైతులు నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. శనివారం ఉదయం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఇతర రాజకీయ నాయకులు విజయగర్జన సభ ఏర్పాట్లకు కొబ్బరికాయ కొడతారన్న సమాచారం మేరకు రైతులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. 

రైతులంతా పొలాలకు ఒకవైపు ఉండగా.. మరోవైపు నుంచి డీసీసీబీ డైరెక్టర్​గుండ్రెడ్డి రాజేశ్వర్​రెడ్డి, మాజీ కార్పొరేటర్, ప్రస్తుత 65వ డివిజన్​ కార్పొరేటర్​భర్త రాజునాయక్​ సభా ప్రాంగణానికి పరిశీలించిన స్థలానికి చేరుకున్నారు. అక్కడ వెంచర్లు చేసిన వ్యక్తితో కలిసి ప్లాట్ల ఓనర్లు, రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 

దీంతో రైతులంతా వారిని చుట్టుముట్టారు. వ్యవసాయ భూములు, వెంచర్​ ప్లాట్లను సాఫ్​ చేస్తే హద్దుల సమస్యలు ఏర్పడతాయని, చేతికొచ్చిన పంటలు నోటికందకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల అభిప్రాయాలను లెక్కలోకి తీసుకోకుండా పనులు ప్రారంభించడానికి ఎలా వస్తారంటూ నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 

అప్పటికే సిబ్బందితో అక్కడికి చేరుకున్న హసన్​పర్తి సీఐ శ్రీధర్​రావు రైతులను అడ్డుకున్నారు. ఆందోళన విరమించకుంటే కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ స్థలాలు మీ అయ్యా జాగీరా? అంటూ దూషించారు. దీంతో రైతులు… రాజునాయక్‌, సీఐతో వాదనకు దిగారు. అవసరమైతే ఇక్కడే చస్తాం కాని సభ పెట్టనివ్వమని ఆందోళన కొనసాగించారు.

 ఓ వైపు టీఆర్ఎస్​నాయకులు, మరోవైపు పోలీసులు రైతులను నియంత్రించే ప్రయత్నం చేయడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన గుండ్రెడ్డి రాజేశ్వర్​రెడ్డి, రాజు నాయక్​ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

ఈ సందర్భంగా అన్నదాతలు మాట్లాడుతూ కొందరు వ్యక్తులు తమవైపు ఉంటూనే డబుల్​డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. నిన్నటి వరకు తమతో ఉండి వెంటనే నాయకుల పక్షాన చేరారని మండిపడ్డారు. పంట పొలాల్లో సభలు నిర్వహించడం కరెక్ట్​ కాదని, సభ కోసం భూములు ఇవ్వడం లేదని వ్యవసాయ బావుల కరెంట్​ కనెక్షన్​ కట్​చేస్తున్నారని వాపోయారు.

సభ నిర్వహణకు స్థలం ఇచ్చేందుకు తమకు అభ్యంతరం ఏమీ లేదంటూ కొందరు ప్లాట్ల ఓనర్లు ఎమ్మెల్యే అరూరి రమేశ్​కు లేఖలు ఇచ్చారు. దీంతో టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న రైతుల భూముల నుంచి విజయగర్జన సభకు పనులు ప్రారంభించారు.  మధు తండా మార్గం నుంచి సభా ప్రాంగణానికి రోడ్డు పనులు ప్రారంభించారు. ఆందోళన చేస్తున్న రైతులంతా ఇండ్లకు చేరిన తరువాత శనివారం సాయంత్రం ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి తదితరులు పనులను పరిశీలించారు.