19న శతాబ్దంలోనే సుదీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం

ఈ శతాబ్దంలోనే మరో సుదీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం వినువీధిలో దర్శనమివ్వబోతోంది. ఇది తూర్పు తీర దేశాల్లో కొంత సమయం.. పశ్చిమ తీర దేశాల్లో మరి కొంత సమయంలో కనువిందు చేస్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. ఈ పాక్షిక చంద్రగ్రహణం ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం. 2001 నుంచి 2100 శతాబ్ధం మధ్య అత్యంత సుదీర్ఘమైనది.

వచ్చే 80 సంవత్సరాలలో 2021, 2030 మధ్య 20 సంపూర్ణ, పాక్షిక, పెనుంబ్రల్‌ గ్రహణాలు ఏర్పడే అవకాశముందని నాసా వెల్లడించింది.ఈ పాక్షిక చంద్రగ్రహణాన్ని చూసేందుకు ప్రజలకు వాతావారణం అనుకూలంగా లేకపోతే తాము ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ప్రకటించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ నాసా అంచనాల ప్రకారం నవంబర్19వ తేదీ దాదాపు 3 గంటల 28 నిమిషాల పాటు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతోంది.

దీన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తప్పకుండా ఇళ్లలో నుంచి బయటికి రావాలని నాసా కోరుతోంది. అమెరికా తూర్పు తీరంలో రాత్రిపూట చూసేవారు అద్భుతాన్ని తెల్లవారుజామున 2 నుండి 4 గంటల వరకు చూడొచ్చని తెలిపింది. పశ్చిమ తీరంలో ఉన్నవారు రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట మధ్య ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశముందని నాసా చెబుతోంది. 

ఈ పాక్షిక చంద్ర గ్రహణం ఉత్తర, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ ప్రాంతంలోని ప్రజలకు కూడా దర్శనమివ్వబోతోంది. నాసా అంచనాల ప్రకారం పాక్షిక చంద్ర గ్రహణం ఈ నెల పౌర్ణమితో పాటు కలిసి రానుంది. దీనిని మంచుతో కప్పబడిన చంద్రుడిగా (ఫ్రాస్ట్‌ మూన్‌) కూడా వ్యవహరిస్తున్నారు. శరదృతువు చివరిలో ఏర్పడే మంచు కారణంగా దానికి ఆ పేరు వచ్చినట్లు తెలుస్తోంది.

శరదృతువు చివరి పౌర్ణమి కూడా ఇదే.  భూమి నీడతో చంద్రుడు పూర్తిగా నల్లబడటం వలన సంపూర్ణ చంద్రగ్రహణంలా ఇది అద్భుతమైనది కానప్పటికీ, ఈ పాక్షిక గ్రహణం చంద్రుని ఉపరితలంలో 97 శాతం కనిపించకుండా దాచేస్తుంది. దీంతో చంద్రునిలో 97 శాతం మాత్రమే కప్పబడి ఉంటుంది.