ఢిల్లీలో కలకలం రేపిన కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఈ కేసుకు సంబంధించి కోర్టులో దాఖలు చేసిన దాదాపు 7500 పేజీల భారీ ఛార్జ్షీట్లో ఉగ్రవాదులు డిజిటల్ విప్లవాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను ఎంత ప్రమాదకరంగా వాడుకున్నారో వివరించింది.
అల్ ఫలాహ్ యూనివర్సిటీలో చదువుతున్న కీలక నిందితుడు జాసిర్ బిలాల్ వానీకి మిగతా ముఠా సభ్యులు పొటాషియం నైట్రేట్, షుగర్ పౌడర్ వంటి ఐఈడీ తయారీ సామగ్రిని సరఫరా చేశారు. అయితే, వీటిని పేలుడు పదార్థాలుగా ఎలా మార్చాలనే సాంకేతిక ప్రక్రియ కోసం నిందితుడు ఏకంగా యూట్యూబ్ వీడియోలను, చాట్జీపీటీ వంటి ఆధునిక ఏఐ టూల్స్ను ఉపయోగించి రాకెట్ ఐఈడీలను తయారు చేయడం ఇప్పుడు భద్రతా సంస్థలను సైతం విస్మయానికి గురి చేస్తోంది.
సాంకేతికత సాయంతో బాంబులను సిద్ధం చేసిన నిందితుడు జాసిర్, వాటి సామర్థ్యాన్ని పరీక్షించేందుకు జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా ఖాజీగుండ్ అటవీ ప్రాంతాన్ని వేదికగా చేసుకున్నాడు. అక్కడ రహస్యంగా ఈ రాకెట్ ఐఈడీలను టెస్ట్ చేసి, ఆ తర్వాతే ఢిల్లీలో విధ్వంసానికి ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
ఇంటర్నెట్లో సులభంగా దొరుకుతున్న సమాచారం, ఏఐ చాట్బాట్ల నియంత్రణల్లో ఉన్న లోపాలను ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్న తీరు ఈ ఘటనతో మరోసారి రుజువైంది. కేవలం ఒక క్లిక్తో లభిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఉగ్రవాద నెట్వర్క్లకు ఎలా ఆయుధంగా మారుతుందో చాటిచెబుతున్న ఈ కేసు, డిజిటల్ ప్లాట్ఫారమ్లపై నిఘా, నియంత్రణలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తోంది.

More Stories
రష్యా సైన్యంలోని 49 మంది భారతీయులు మృతి
చిన్నపిల్లల మిస్సింగ్ కేసులను కిడ్నాప్ గా పరిగణించాలి
రేజర్వేషన్లు కొన్ని కుటుంబాలకే నిరంతరం.. సుప్రీం ప్రశ్నలు!