బ్రిటన్ లో త్వరలో కరోనాకు మందు

కరోనా మహమ్మారిని  కట్టడి చేసేందుకు మొత్తం ప్రపంచం టీకాల కోసం సతమతమవుతుండగా, బ్రిటన్ ఒకడుగు ముందుకు వేసి కరోనా చికిత్సకు మందును అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది. అమెరికా సంస్థ మెర్క్, రిడ్జ్ బ్యాక్ బయోథెరాప్టిక్స్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ఈ టాబ్లెట్‌ వినియోగానికి అనుమతిస్తున్నట్టు బ్రిటన్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 
 
మోల్నుపిరావిర్ పేరుతో తయారైన ఈ మాత్రను కరోనా పాజిటివ్‌గా తేలిన ఐదు రోజుల్లోపు వేసుకోవడం మొదలెట్టాలని బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ (ఎమ్‌హెచ్ఆర్ఏ) సూచించింది. కరోనాకు ఈ నూతన చికిత్స విధానాన్ని ఆమోదించిన తొలి దేశంగా బ్రిటన్ చరిత్ర సృష్టించింది. 
 
ఈ టాబ్లెట్‌పై అమెరికాలో సమీక్షలు జరుగుతున్న సమయంలోనే బ్రిటన్ దూకుడుగా ముందుకెళ్లి కావాల్సిన అనుమతులు జారీ చేసేసింది. మరోవైపు.. ఈ నెలలో జరగబోయే సమావేశంలో అమెరికా కూడా మోల్నుపిరావిర్‌పై ఓటింగ్ చేపట్టనుంది.  
దాదాపు 5.2 మిలియన్ల ప్రాణాలను బలిగొన్న కరోనాకు చెక్ పెట్టే ఆయుధమంటే ఇప్పటివరకూ మనకు గుర్తొచ్చేది టీకాలే. ఇక రెమ్‌డెసివర్, డెక్సామెథాజోన్ వంటివి అందుబాటులో ఉన్నప్పటికీ వీటిని వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే.. మోల్నుపిరావిర్‌ను మాత్రం రోగులు ఇంటి వద్ద ఉంటూనే తీసుకోవచ్చు.
దీంతో వ్యాధి ముదిరి ఆస్పత్రిపాలయ్యే ప్రమాదం దాదాపు 50 శాతానికి పైగా తగ్గిపోతుంది. ఇక బ్రిటన్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ మాత్రకు ఆమోదం లభించడం అక్కడి ప్రజలకు స్వాంతన కలిగించే విషయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వైరస్ జన్యువుల్లో తప్పులు దొర్లేలా చేస్తూ ఈ మాత్ర వైరస్‌ను నాశనం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.