సిద్దిపేట కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం

వరిసాగుపై సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు మంగళవారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో వరి విత్తనాలు అమ్మకూడదని సిద్దిపేట కలెక్టర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని, దీనిపై చర్యలు తీసుకోవాలని మెదక్ రైతు బాతుల నారాయణ వేసిన పిటిషన్‌లో పేర్కొన్న అంశాలపై విచారణ చేపట్టింది. 
 
సిద్దిపేట కలెక్టర్, తెలంగాణ ప్రభుత్వం, సిద్దిపేట వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారిని పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు. వరి విత్తనాలమ్మితే చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ తీరుగా ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సిద్దిపేట జిల్లాలో వరి విత్తనాల విక్రయాల్లో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి జోక్యం చేసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది.
 
వరిసాగుపై కోర్టు ఉత్తర్వులు తెచ్చుకున్నా కూడా పట్టించుకోబోమని కలెక్టర్ వ్యాఖ్యానించారని పిటిషనర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వరి విత్తనాల విక్రయంపై నిషేధం లేదని ఎజి ప్రసాద్ ఉన్నత న్యాయస్థానానికి వివరించారు.వరి విత్తనాల అమ్మకాలను ప్రొహిబిషన్ యాక్ట్‌లో ఏమైనా చేర్చారా అని హైకోర్టు ప్రశ్నించింది. 
 
అలాంటిదేమీ లేదని ఎజి ప్రసాద్ కోర్టుకు తెలిపారు. అలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోలేదని, ఇకపై కూడా తీసుకోబోదని హామీ ఇచ్చారు. అయితే రైతుల విషయంలో కలెక్టర్ ఎలా వ్యాఖ్యలు చేస్తారని హైకోర్టు ప్రశ్నించారు. కలెక్టర్ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో క్రిమినల్ కంటెంట్ కనబడుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.