భూముల వేలంపై తెలంగాణ ప్రభుత్వానికి చావు దెబ్బ

రాష్ట్రంలో భూముల వేలంపై తెలంగాణ ప్రభుత్వానికి చావు దెబ్బ తగిలిందని బిజెపి నేత, మాజీ ఎంపీ విజయశాంతి ధ్వజమెత్తారు. భూముల వేలంపై తాజా హైకోర్టు స్పందనను ప్రస్తావిస్తూ ఓవైపు భూములను రక్షిస్తామని చెప్తూనే మరోవైపు కబ్జాలకు గురవుతున్న కారణంగానే భూములను వేలానికి పెడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోందని, ఈ ద్వంద నీతి ఏంటని ఆమె ప్రశ్నించారు. 

వేలం సంగతి అలా ఉంచి… ఉన్న భూమిని ఎలా కాపాడతారో చెప్పండంటూ న్యాయస్థానం నిలదీసిందని ఆమె గుర్తు చేశారు.  ధనిక రాష్ట్రమంటూ తెలంగాణను అప్పులకుప్పగా మార్చిన పాలకులు ఇప్పుడు ఆ అప్పుల తిప్పల నుంచి బయటపడేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ భూముల్ని వేలంలో తెగనమ్మేందుకు సిద్ధపడుతున్నారని ఆమె విమరసంచారు. 

తద్వారా భవిష్యత్తులో భావితరాల కోసం ప్రభుత్వం తరఫున ఏ చిన్న నిర్మాణం చెయ్యాలన్నా సర్కారు భూమి కోసం దిక్కులు చూసే పరిస్థితి తీసుకొస్తున్నారని ఆమె దయ్యబట్టారు. కోకాపేట భూముల వేలంతో వచ్చిన ఆదాయాన్ని చూసుకుని వెర్రెత్తిపోయి, మరింత దూకుడుగా భూముల వేలంతో ముందుకెళ్ళాలనుకున్న సర్కారుకు వివాదాలు, కేసులు స్వాగతం చెప్పడంతో పుప్పాలగూడ, ఖానామెట్‌ భూముల వేలానికి బ్రేక్ పడిందని ఆమె తెలిపారు. 

అసలు ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నందువల్లే వేలం వేస్తున్నట్టు చెప్పుకున్న తెలంగాణ పాలకులు ఇంకోపక్క రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 వేల ఎక‌రాల ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధం చేస్తున్నట్టు చెప్పుకుంటోందని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. మరి ఈ ల్యాండ్ బ్యాంక్ భూములు మాత్రం కబ్జాలకు గురికాకుండా ఎలా రక్షిస్తారనే ప్రశ్నకు జవాబివ్వలేకపోవడం ప్ర‌భుత్వ చేతగానితనం తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు. 

 నిజానికి ఈ ప్రశ్న ఈ రోజు కొత్తగా తలెత్తింది కాదని, జూలై నెలలో తాను పిటిషన్ వేసినప్పుడే  ప్రభుత్వమే భూములను కాపాడుకోలేక, అమ్ముకోవడమేంటని న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసిందని ఆమె గుర్తు చేశారు. కనీసం అప్పుడైనా మేలుకోవలసిన సర్కారు మరికాస్త మత్తులోకి జారుకుందని ఆమె ధ్వజమెత్తారు. 

తాజాగా  అసలు ప్ర‌భుత్వ భూముల‌ను ఎలా రక్షిస్తారో 4 వారాల్లో వివ‌ర‌ణ ఇవ్వాలని….,  వేలం వేసే భూముల వివ‌రాల‌ను కూడా తమకు ఇవ్వాలని న్యాయమూర్తులు సర్కారును ఆదేశించారు. అంతే కాదు, కోకాపేట్, ఖానామెట్ మొద‌టి ద‌శ వేలాన్ని సర్కారు ఏ విధంగా స‌మ‌ర్ధించుకుంటుందో కూడా తమకు తెలియ‌జేయాల‌ని హైకోర్టు అదేశించిందని ఆమె గుర్తు చేశారు. 

అదే విచారణ సందర్భంగా… పుప్పాలగూడలోని సర్కారీ భూములను వేలం వెయ్యాలని ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు ప్రభుత్వమే తెలియజేసి, వెనక్కి తగ్గి, తోక ముడిచేట్లు మన కొట్లాట ద్వారా చెయ్యగలిగామని ఆమె చెప్పారు. నిజం చెప్పాలంటే తెలంగాణలో సర్కారు భూములకు అసలైన శత్రువు అధికార పార్టీయే అని ఆమె స్పష్టం చేశారు. 

భూములతో పాటు చెరువుల ఆక్రమణల్ని కూడా ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నట్టు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మంత్రులపై కోకొల్లలుగా ఆరోపణలు, బలమైన సాక్ష్యాలు మీడియాలోను, సోషల్ మీడియాలోను చక్కర్లు కొడుతున్నాయని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ సర్కారు ఇప్పటికైనా భూముల అమ్మ‌కాన్ని నిలిపేలా ఉత్తర్వులు జారీ చేసి,  జీవో 13ను కొట్టివేయాలని ఆమె కోరారు. అయినా మొండి వైఖరితో ముందుకెళితే బుద్ధి చెప్పడానికి జనం సిద్ధంగా ఉన్నారని ఆమె హెచ్చరించారు.