ప్రాంతీయ పార్టీల విరాళాలు అత్యధికంగా శివసేనకే

2019- 20 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విరాళాలు ప్రకటించిన టాప్ 5 ప్రాంతీయ పార్టీల్లో శివసేన, ఎఐఎడిఎంకె, ఆప్, బిజూ జనతా దళ్, వైఎస్‌ఆర్‌సిపి ఉన్నాయి. అందరికంటే అత్యధికంగా శివసేన 436 విరాళాల ద్వారా రూ.62.859 కోట్లు అందుకొంది.

 
ఎఐఎడిఎంకె మూడు విరాళాల ద్వారా రూ.52.17 కోట్లతో తర్వాతి స్థానంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ రూ.37.37 కోట్లతో మూడో స్థానంలో ఉంది. వీటిలో శివసేన, బిజెడి, వైఎస్‌ఆర్ సిపిలు తమ విరాళాల తగ్గినట్లు ప్రకటించగా, ఎఐఎడిఎంకె, ఆప్‌ల విరాళాలు మాత్రం 2018- 19తో పోలిస్తే పెరిగాయి. 
దేశంలో 16 ప్రాంతీయ పార్టీలు రూ.24.779 కోట్ల విలువైన 1,026 విరాళాలను పాన్ వివరాలు లేకుండా స్వీకరించినట్లు ప్రకటించాయని ఎన్నికల వాచ్ డాగ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఎడిఆర్) నివేదిక వెల్లడించింది.
ఎన్నికల కమిషన్‌కు రాజకీయ పార్టీలు 2019- 20కి సంబంధించి ప్రకటించిన వివరాల ఆధారంగా ఎడిఆర్ ఈ నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం 2018 -19, 2019- 20 మధ్య కాలంలో జార్ఖండ్ ముక్తిమోర్చా (జెఎంఎం), లోక్‌జనశక్తి పార్టీ, సమాజ్‌వాది పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలకు విరాళాల ద్వారా వచ్చిన ఆదాయం గరిష్ఠ శాతం పెరిగింది.
 
నగదు రూపంలో గరిష్ఠంగా విరాళాలు సేకరించినట్లు ప్రకటించిన పార్టీ ఇండియన్ యూనియన్ ముస్లింంలీగ్. ఆ పార్టీ నగదు రూపంలో రూ.4.63 కోట్లు సేకరించగా తమిళనాడుకు చెందిన పట్టాలి మక్కళ్ కచ్చి(పిఎంకె) రూ.52.20 లక్షలు, ఎల్‌జెపి రూ.6 లక్షలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 
 
నాగాలాండ్, మణిపూర్‌కు చెందిన నాగా పీపుల్స్‌ఫ్రంట్ రూ.3.92 లక్షలు, ద్రవిడ మున్నేట్ర కళగం (డిఎంకె) రూ.29,000 నగదు రూపంలో విరాళాలు సేకరించాయి. ఈ నివేదిక మొత్తం 56 పార్టీల విరాళాలను విశ్లేషించగా, రెండు పార్టీలు మాత్రమే నిర్ణీత గడువు లోగా ఎన్నికల కమిషన్‌కు విరాళాల వివరాలను సమర్పించాయి.  తమ విరాళాల వివరాలను ఇప్పటికీ ఇసికి సమర్పించని ప్రాంతీయ పార్టీలు 23 ఉన్నాయి.