టిటిడి బోర్డు లో నేరచరిత్రులపై హైకోర్టు ఆగ్రహం 

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలిలో నేర చరిత్ర ఉన్న వారిని నియమించడంపై ఏపీ హైకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. బోర్డు సభ్యుల నియామకంపై జారీ అయిన జావోను సవాల్‌ చేస్తూ.. బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. 

పిటిషన్‌ తరఫున న్యాయవాది అశ్వినికుమార్‌ వాదనలు వినిపించారు. భారత వైద్య మండలి మాజీ చైర్మన్ కేతన్ దేశాయ్‌ను పాలకమండలి సభ్యుడిగా నియమించడంపై అశ్విని కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేతన్ దేశాయిని పాలక మండలి సభ్యుడిగా నియమించడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 

వెంటనే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్  కార్యదర్శి, టీటీడీ కార్య నిర్వహణాధికారితో పాటు 18 మందికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

ఆగస్ట్‌లో ఏపీ ప్రభుత్వం టీటీడీ పాలకవర్గాన్ని నియమించిన విషయం తెలిసిందే. చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వడంతో పాటు పలువురిని సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, టీటీడీ బోర్డు సభ్యుల నియామకంలో నేర చరిత్ర ఉన్నవారిని నియమించారంటూ గత కొన్ని రోజులుగా ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.