వరి పంటపై మంత్రులు, అధికారులు తలో ప్రకటన 

రైతులు  వరి పంట వేసే విషయమై తెలంగాణ మంత్రులు, అధికారులు తలో ఒక మాట అంటూ ఉండడంతో రైతులు గందరగోళానికి గురవుతున్నారు. ఉద్దేశ్య పూర్వకంగా రైతులను వారి పండించకుండా నిరుత్సాహ పరచేందుకే  పొంతనలేని ప్రకటనలు చేస్తున్నట్లు కనిపిస్తున్నది. 
దానితో రాష్ట్రంలో వరి పంటలపై నీలి నీడలు అలుముకున్నాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరిని పండిస్తున్న రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తాయరయ్యె పరిస్థితి కనిపిస్తోంది. 
రైతులంతా బ్రహ్మండంగా వడ్లు వేసుకొవచ్చని ఆర్థిక మంత్రి హరీష్ రావు భరోసా ఇచ్చారు. పైగా, యాసంగి వడ్లే కొనబోమని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కావాలనే బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వరి విత్తనాలు అమ్మితే షాపులు క్లోజ్ చేస్తామని సుప్రీం కోర్టు ఆర్డర్ వచ్చినా లెక్కచేయనని అంటూ సిద్దిపేట కలెక్టర్ వివాదాస్పద ప్రకటన చేశారు. 
 
మరోవంక,  యాసంగిలో వరిధాన్యం కొనుగోలుచేసే పరిస్థితి లేదన్నారు మరో మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయపంటలపై రైతులు దృష్టిపెట్టాలని సూచించారు. వరిసాగు-ప్రత్యామ్నాయ పంటలు, వడ్ల కొనుగోలుపై మంత్రి సమీక్ష నిర్వహించారు, దేశంలో నూనెగింజల కొరత ఉంది కాబట్టీ.. రైతులు వాటిని సాగుచేయాలని ఆయన సూచించారు. ఇతర రాష్ట్రాలు కూడా అధికంగా వరిని పండించడం వల్లే కేంద్రం చేతులెత్తేసిందని తెలిపారు. ప్రత్యామ్నాయ విత్తనాల కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి చెప్పారు.

రైతులు హైబ్రిడ్ లేదా సూటి రకాల వరి విత్తనోత్పత్తి చేసుకోవచ్చని కరీంనగర్ కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు. సీడ్ ప్రొడక్షన్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. జిల్లాలోని రైస్ మిల్లర్లు సన్నరకం ధాన్యం కొనుగోలుకు అంగీకరించినందున రైతులు సన్నాలు వేసుకోవచ్చని చెప్పారు. 

ఇక ప్రైవేటు విత్తన కంపెనీలు, సీడ్ కార్పొరేషన్ తో ఒప్పందం చేసుకున్న రైతులు వరి విత్తన ఉత్పత్తి చేసుకోవచ్చని ఆయన సూచించారు. నీరు నిల్వ ఉండే నేలలు, చౌడు నేలల్లో వరి పంటను సాగు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనేదిలేదని చెప్పకుండా.. ప్రైవేటు విత్తన కంపెనీలతో ఒప్పందం ఉన్న రైతులే సాన్నాలు సాగు చేయాలని ఆయన చెప్పడం గమనార్హం. పైగా, మిల్లర్లు కొంటామని చెప్పినందున.. సన్న రకం సాగు చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. 

వరి కొనుగోలుపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారని బిజేపీ ఎంపీ డి అరవింద్ ధ్వజమెత్తారు. సిద్దిపేట కలెక్టర్ సుప్రీం కోర్టు ఆర్డర్ ను కూడా లెక్కచేయనంటున్నారని విస్మయం వ్యక్తం చేశారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన కలెక్టర్ ఇప్పటికే సస్పెండ్ కావాల్సిందని పేర్కొన్నారు.

తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా చేస్తామన్న కేసీఆర్..ఇవాళ  సీడ్ అమ్మితే జైల్లో వేస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. వరి విత్తనాలు అమ్మకపోతే..గంజాయి అమ్మమంటారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో గంజాయి విపరీతంగా సాగైతుందని పేర్కొంటూ యువతకు సరఫరా చేస్తున్నవారిలో టీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారని ఆయన ఆరోపించారు.

గంజాయి సరఫరా  చేస్తే జైల్లో వేస్తామని ఒక్క పోలీస్ అధికారి కూడా ఆదేశాలివ్వలేదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేస్తానన్న కేసీఆర్..ఇవాళ వరి వేయొద్దని..మక్క వేయొద్దంటున్నారని పేర్కొన్నారు. కోటి ఎకరాల మాగాణి.. లక్షన్నర కోట్ల కాళేశ్వరం మీ మామ ఫామ్ హౌస్ కోసమా?. ఖర్చు పెట్టేది దేని కోసం? అని  మంత్రి హరీశ్ ను ప్రశ్నించారు.

ఇలా ఉండగా, కేసీఆర్ ప్రభుత్వం రైతుల నుండి వడ్లు కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నేడు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టనున్నారు.