రూ 40 వేలకే ఓకాయా ఎలక్ట్రిక్ స్కూటర్ 

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీలో ప్రవేశించిన ప్రముఖ ఓకాయా పవర్‌గ్రూప్‌ దేశంలో అతి చవక ధరకు రూ.39,999 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకు రానున్నది. 
 
ఇప్పటికే ఈ సంస్థ హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో ద్విచక్ర వాహనాల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా హర్యానాలో మరో తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది. అలాగే నీమ్రానా (రాజస్థాన్‌)లో 2023-25 నాటికి మరో మూడు ప్లాంట్లను ప్రారంభించినున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. 
 
ఈ సంస్థ తనకంటూ ప్రత్యేకతను చాటుకోవాలనే అవియోనిక్‌ సిరీస్‌, క్లాస్‌ ఐక్యూ సిరీస్‌, ఫ్రీడమ్‌ సిరీస్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల్లలో ప్రస్తుత భారతీయ పరిస్థితులకు అనుగుణంగా.. అధునాతన టెక్నాలజీని తీసుకొస్తున్నట్లు తెలిపింది. 
 
దసరా పండుగ సందర్భంగా ఇటీవల ప్రారంభించిన ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలకు వినయోగదారుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో.. డీలర్‌షిప్‌ నెటవర్క్‌ను విస్తరించేలా ఆ సంస్థ ప్రణాళికలు వేస్తోంది. ఈ వాహనాలకు డిమాండ్‌ పెరగడంతో.. కొత్తగా ఏడు రాష్ట్రాల్లో 165 ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ (ఈ 2 డబ్ల్యు) డీలర్లను ఓకాయా పవర్‌ గ్రూప్‌ నియమించింది.
 
అలాగే ఓకాయా భారతదేశంతోపాటు విదేశాల్లో కూడా ప్రత్యేకంగా రెండు అత్యాధునిక ఆర్‌ అండ్‌ డి సెంటర్లు నెలకొల్పనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ కంపెనీ స్కూటర్లను నడపడానికి ప్రత్యేకించి ఎటువంటి లైసెన్సు, రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు. ఈ కంపెనీ తయారు చేసిన స్కూటర్లు ఒకసారి చార్జ్‌ చేస్తే 80 కిలోమీటర్ల వరకు వెళ్లనున్నాయి. ఓకాయా పవర్‌గ్రూప్‌ భారతదేశంలో నాలుగు దశబ్దాలుగా బ్యాటరీ తయారీ రంగంలో నమ్మకానికి, నాణ్యతకు చిహ్నంగా అగ్రగామిగా ఉంది. 
 
ఈ అనుభవంతోనే ఓకాయా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ రంగంలోకి ప్రవేశించింది. తమ సంస్థ ఎలక్ట్రిక్‌ వేహికల్స్‌, ఎలక్ట్రిక్‌ వేహికల్‌ బ్యాటరీల నుంచి ఈవి ఛార్జింగ్‌, బ్యాటరీ స్వాపింగ్‌ పరిష్కారాల వరకు అన్నిటికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుందని భరోసా ఇస్తున్నారు.