బద్వేల్ లో భావోద్వేగాలా? అభివృద్దా?

బద్వేల్ ప్రజలు తమకు భావోద్వేగాలు కావాలా, అభివృద్ధి కావాలా తేల్చుకోవాలని శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణ నందస్వామి సూచించారు. కొన్ని పార్టీలు సంప్రదాయం పాటిస్తున్నామని అంటూ పోటీలో లేవని, అధికారంలో ఉన్న వైసిపి హయాంలో ఇక్కడ జరిగిన అభివృద్ధి శూన్యం అని ఆయన తెలిపారు. 
 
 బద్వేలు ఉపఎన్నికలో బీజేపీ తరపున ప్రచారం చేస్తూ బద్వేలు అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. అడుగడునా రోడ్లు గుంతలమయమని, సీఎం జగన్ బద్వేల్ అభివృద్ధి పట్ల దృష్టి సారింపలేదని ఆయన విమర్శించారు. రాజకీయాలంటే భావోద్వేగాలు కావని ఆయన హితవు చెప్పారు. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడమే అని పేర్కొంటూ కుటుంబంలో వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబంలో వ్యక్తినే ఎన్నుకోవాలనుకోవడం సరికాదని తేల్చి చెప్పారు. బీజేపీ పార్టీ నిబద్ధతతో రాజకీయాలు చేస్తుందని స్వామీజీ చెప్పారు.

బద్వేలులో బీజేపీ అభ్యర్థి పనతల సురేష్ విద్యావంతుడని,  విద్యార్థి దశ నుంచి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారని తెలిపారు. బీజేపీ అధిష్ఠానం విద్యావంతుడిని అభ్యర్థిగా నిలబెట్టిందని చెబుతూ బద్వేలు అభివృద్ధి కావాలంటే పనతల సురేష్‌ను బద్వేలు ప్రజలు గెలిపించుకోవాలని సూచించారు.

అసెంబ్లీలో బద్వేలు అభివృద్ధిపై మాట్లాడే వ్యక్తి సురేష్ అని చెప్పుకొచ్చారు. బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ పీఠం స్వామీజీ పరిపూర్ణానంద స్వామి గారు బద్వేల్ లోని ఒక హరిజన వాడకు ప్రచారానికి వెళ్లారు. ఆ వాడలో ఇళ్లు ఎప్పుడు పడిపోతాయో అనే విధంగా ఉన్నాయి. ఆ కాలనీవాసులను స్వామీజీ మీకు ఏమి కావాలి అని అడిగితే.. మాకు రామాలయం నిర్మించి ఇవ్వండి స్వామీజీ అని అడిగారు. స్వామీజీ మీకు నిలవడానికి సరిగా నీడ లేదే ముందు గూడు చూసుకోండి అంటే… మేము ఎప్పటి నుంచో ఈ రకమైన ఇళ్లల్లో ఉంటున్నాము.

కానీ మాకు రామాలయం కావాలి అని వేడుకున్నారు. వెంటనే స్వామీజీ స్థలం ఎక్కడ ఉందని అడిగారు. వారు వెంటనే కాలనీ వాసులందరూ ఒక పది సెంట్లు స్థలాన్ని ఎవరికి ఇబ్బంది లేని స్థలాన్ని చూపించారు. ఆయన  వెంట పర్యటనలో ఉన్న బిజెపి దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కట్టు దేవానంద్ లక్ష రూపాయలు వెంటనే ప్రకటించారు

బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి సురేష్ మీరు తనకు ఓటు వేసినా, వేయకపోయినా, తాను గెలిచినా, ఓడినా ఈ కాలనీలో ఖచ్చితంగా రామాలయం నిర్మాణానికి కృషి చేస్తానని వాగ్దానం చేశారు ఆ కాలనీలో 70 కుటుంబాలు ఉన్నాయి వారందరూ తాము ఖచ్చితంగా బిజెపికి ఓటు వేస్తాము అని బహిరంగ ప్రకటన చేశారు.

బద్వేల్ లో బిజెపి కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ బద్వేల్ లో బిజెపి అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని, తద్వారా ఈ రాష్ట్రంలో బిజెపి గెలుపుకు నాంది పలకాలని స్వామిజి పిలుపిచ్చారు. 2024 ఎన్నికల్లో కేంద్రంలో బిజెపికి 350 సీట్లు రావాలి అంటే ప్రధాని మోదీ వలే మనమంతా అకుంఠిత దీక్షతో పనిచేస్తే తప్పా సాధ్యం కాదని స్పష్టం చేశారు.