పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలిస్తున్న అథారిటీ బృందం

పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం సోమవారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి పనులను పరిశీలించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సిఇ ఎకె.ప్రధాన్‌ నేతృత్వంలో బృందం తొలుత స్పిల్‌వేలో ఫిష్‌ లాడర్‌, రేడియల్‌ గేట్ల పనితీరును పరిశీలన చేసింది.

అనంతరం ఎస్‌ఇ నరసింహమూర్తి, సిఇ సుధాకర్‌బాబు ఎగువ, దిగువ కాపర్‌ డ్యామ్‌, గ్యాప్‌-3 పనుల వివరాలను మ్యాప్‌ ద్వారా బృందానికి వివరించారు. అనంతరం అథారిటీ బృందం ఎగువ దిగువ, కాపర్‌ డ్యామ్‌లను పరిశీలించింది. గ్యాప్‌-1 వద్ద భూఅంతర్భాగ మట్టి సేకరణ యంత్రాన్ని పరిశీలించి, యంత్రం పనితీరుపై అధికారులను ఆ బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు.

పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ కనెక్టివిటీ పనుల పరిశీలనలో భాగంగా చేపట్టిన తోటగొంది, మామిడిగొంది, దేవరగొంది, చేగొండపల్లి గ్రామాల మధ్య నిర్మించిన జంట గుహలను, హెడ్‌ రెగ్యులేటర్‌, శాడిల్‌ డ్యామ్‌ పనులను పరిశీలించారు. స్పిల్‌వే గ్యాలరీలోకి వెళ్లి పవర్‌ బాక్సుల ఏర్పాటు పనితీరు ఆరా తీశారు.

ఈ బృందం ప్రాజెక్ట్‌ అతిథి గృహంలో రాత్రికి బస చేసి మంగళవారం తూర్పుగోదావరి జిల్లా అంగులూరు సమీపంలో జరుగుతున్న ఎడమ ప్రధాన కాలువ కనెక్టివిటీ పనులు, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలను పరిశీలించనుంది. బుధవారం కుడి ప్రధాన కాలువ కనెక్టివిటీ పనులు, పశ్చిమగోదావరి జిల్లాలోని ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలను ఈ బృందం పరిశీలిస్తుందని ఎస్‌ఇ నరసింహమూర్తి తెలిపారు.