డీఆర్డీవో ‘అభ్యాస్’ పరీక్ష విజయవంతం

హై స్పీడ్ ఎక్స్‌పెండబుల్ ఏరియల్ టార్గెట్‌, ‘అభ్యాస్‌’ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చందీపూర్ టెస్ట్‌ రేంజ్‌ నుంచి దీనిని ప్రయోగించి పరీక్షించింది.  ట్రయల్ రన్‌ సమయంలో పలు సాంకేతిక అంశాలను పరిశీలించింది. గ్రౌండ్-బేస్డ్ కంట్రోలర్ నుండి సబ్‌సోనిక్ వేగంతో ఎగిరిన అభ్యాస్‌ ముందుగా నిర్ణయించిన లక్ష్యాన్ని ఛేదించింది. 2019 మేలో తొలిసారి దీనిని విజయవంతంగా పరీక్షించారు.

వాయు టార్గెట్లకు వినియోగించే వివిధ క్షిపణి వ్యవస్థల మూల్యాంకనం కోసం గ్రౌండ్-బేస్డ్ కంట్రోలర్ వాహనాన్ని వినియోగిస్తారు. భారత సాయుధ దళాల కోసం ‘అభ్యాస్‌’ను డీఆర్డీవోకు చెందిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏడీఈ) 2012 నుంచి అభివృద్ధి చేస్తున్నది.

ఉపరితలం నుండి గాల్లోకి, ఎయిర్-టు-ఎయిర్ ఇంటర్‌సెప్షన్ క్షిపణులను పరీక్షించే విమానాలను ఇది స్టిమ్యులేట్‌ చేస్తుంది. టార్గెట్ రాడార్ రిఫ్లెక్టివిటీ, ఎకౌస్టిక్ మిస్ డిస్టెన్స్ ఇండికేటర్  వ్యవస్థను మెరుగుపరచడానికి ముక్కు కోన్‌లో లూన్‌బర్గ్ లెన్స్‌తో సర్దుబాటు చేయగల రాడార్ క్రాస్-సెక్షన్‌ను ఇది కలిగి ఉంటుంది.పూర్తిగా స్వయంప్రతిపత్తిగా ఎగిరే అభ్యాస్‌, గ్యాస్ టర్బైన్ ఇంజిన్ ఆధారంగా పని చేస్తుంది. నావిగేషన్ కోసం మైక్రో ఎలక్ట్రోమెకానికల్ సిస్టమ్‌లను ఉపయోగించారు. ఫ్లైట్‌ మార్గదర్శకత్వం, నియంత్రణను కంప్యూటర్ ద్వారా నిర్వహిస్తారు.

వివిధ క్షిపణి వ్యవస్థల పనితీరును అంచనా వేయడం కోసం ఏరియల్ టార్గెట్‌గా దీన్ని ఉపయోగించవచ్చు.ఈ టార్గెట్ విమానం పని తీరును టెలిమెట్రీ, రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టం లాంటి వివిధ సెన్సర్ల ద్వారా పర్యవేక్షించినట్లు దీన్ని రూపొందించిన డిఆర్‌డిఓ వర్గాలు తెలిపాయి. పరీక్షను విజయవంతంగా నిర్వహించినందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిఆర్‌డిఓ శాస్త్రజ్ఞులను అభినందించారు.

బెంగళూరులోని డిఆర్‌డిఓకు చెందిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో దీన్ని అభివృద్ధి చేశారు. శబ్ద వేగానికన్నా తక్కువ వేగంతో ఎక్కువ సమయం ప్రయాణించడానికి వీలుగా దీనిలో గ్యాస్ టర్బైన్ ఇంజన్‌ను ఏర్పాటు చేశారు.