హుజురాబాద్ లో దళిత బంధు నిలిచిపోవడానికి కేసీఆరే కారణమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ స్పష్టం చేశారు. రెండు నెలల లోపు హుజురాబాద్ లో అందరికి దళిత బంధు ఇస్తా అని కేసీఆర్ మాట ఇచ్చారని, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక దళితబంధు బీజేపీ ఆపిందని నిందలు వేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
కేసీఆర్ కు సీఎంగా ఉండే అర్హత లేదని ఆమె పేర్కొంటూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా వరదల్లో నష్టపోయిన వారికి 10 వేల రూపాయలు ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పటికి ఇవ్వలేదని ఆమె గుర్తు చేశారు.
పైగా, ఆ రూ 10 వేల నిధులు ఇవ్వొద్దని బండి సంజయ్ ఈసీకి లేఖ రాసినట్లుగా దొంగ లేఖ సృష్టించారని ఆమె ధ్వజమెత్తారు. హుజురాబాద్ లో రెండు నెలలుగా దళిత బంధు అమలు చేయకుండా ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. హుజురాబాద్ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేసిందని ఆమె పేర్కొన్నారు.
ఒక నియోజకవర్గంలో ఎన్నికల కోసం తెచ్చిన అబద్దపు హామీ, మోసం తేట తెల్లమైందని ఆమె దయ్యబట్టారు. బీజేపీ దళిత బంధు ఆపిందన్న అసత్య ప్రచారాలు టీఆర్ఎస్ ఆపాలని ఆమె హితవు చెప్పారు. దళితులకు ఆశ పెట్టి మోసం చేయాలనుకున్నారని ఆరోపిస్తూ కేసీఆర్ ప్రజలను మోసం చేయడం మానుకోవాలని ఆమె హితవు పలికారు.
అసత్యాలు ప్రచారం చేస్తే ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు. దళిత బంధు ఆపమని బీజేపీ లేఖ రాస్తే ఆ లేఖను బయట పెట్టాలని అరుణ డిమాండ్ చేశారు. దళితులనే కాదు బీదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి అమలు చేయాలనిని కోరుతున్నామని ఆమె చెప్పారు.
ఎన్నికల కోసం పథకాలు కాదు..రాష్ట్రం కోసం పథకాలు ఉండాలని ఆమె సూచించారు. వర్షాలు పడి పంట నష్టపోయి తీవ్ర ఇబ్బందుల్లో రైతులు ఉన్నారని, అయినా పంట నష్ట అంచనా వేయలేదని ఆమె ధ్వజమెత్తారు. రైతు బంధు ఇచ్చామని చేతులు దులుపుకుంటున్నారని ఆమె ఆరోపించారు.
More Stories
తెలంగాణ మంత్రివర్గ సమావేశంకు ఈసీ అనుమతి
యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి
వడ్ల కొనుగోలు వేగవంతం చేయండి రేవంత్