దళితబంధు అమలుపై కెసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు

దళితబంధు అమలుపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని బీజేపీ ఎమ్మెల్యే ఎన్ రఘనందనరావు ధ్వజమెత్తారు. దళితబంధుపై హుజురాబాద్‌లో మంత్రి కేటీఆర్‌తో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. దళితులకు మూడెకరాల భూమి మాదిరే  దళితబంధు పథకం కూడా అని ఎద్దేవా చేశారు. 
 
తమకు పది లక్షలు ఇచ్చే ఆలోచన కేసీఆర్‌కు లేదని హుజురాబాద్ ప్రజలే మట్లాడుకుంటున్నారని ఆయన తెలిపారు. దళితబంధును ఆపమని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మానాభరెడ్డి ఈసీకి ఆగస్టులోనే లేఖ రాశారని ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయకుండా ఎందుకు ఫ్రీజ్ చేశారో కేటీఆర్  చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
టీఆర్ఎస్ ఓటమి ఖాయమని తేలటం వలనే కేటీఆర్ హుజురాబాద్‌లో ప్రచారానికి రావటం లేదని ఆరోపించారు. ఈటల సంగతి అటుంచితే.. హరీష్ రావే కాంగ్రెస్‌లోకి వస్తున్నాడని రేవంత్ రెడ్డి చెప్తున్నారని తెలిపారు.  కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతవుతోందనే హుజురాబాద్ రావటానికి రేవంత్‌కు ముఖం చెల్లటం లేదని రఘునందనరావు విమర్శించారు.