వైసీపీ అధ్యక్ష పదవికి పోటీకి రఘురామ సిద్ధం 

వైసీపీ అధ్యక్ష పదవికి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిపితే ఆ పదవి కోసం జగన్‌పై పోటీకి తాను సిద్ధమని ఆ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రకటించారు. పార్టీ నేతల మద్దతు తనకుందని భరోసా వ్యక్తం చేశారు. 

జగన్‌రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల క్రమక్రమంగా ప్రజాదరణ కోల్పోతోందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల తాను క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు తమ పార్టీ సిద్ధమైతే, తాను కూడా ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమని స్పష్టం చేశారు. 

వైసీపీని బీజేపీ నాయకత్వం కేంద్ర మంత్రిమండలిలోకి తీసుకునే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఆ పార్టీని ఎన్డీయేలో చేరమని కేంద్ర మంత్రి  అథావలే చేసిన ప్రకటనను పట్టించుకోవలసిన  అవసరమేలేదని కొట్టిపారేశారు. 

వైసీపీ నేతలు, ఎంపీలు రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి, తనపై అనర్హత వేటు వేయించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని రఘురామ విమర్శించారు. జగన్‌రెడ్డి ప్రజలకిచ్చిన హామీలను విస్మరిస్తున్నారని, ఆ హామీలను తాను గుర్తు చేస్తున్నందుకే అనర్హత వేటు వేయించే పనిలో ఉన్నారని ఆరోపించారు. సినిమా థియేటర్లకు లేని కొవిడ్‌ ఆంక్షలు.. దేవాలయాలకు ఎందుకని ప్రశ్నించారు.