మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు డెంగ్యూ

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు డెంగ్యూ వ్యాధి సోకినట్లుగా నిర్ధారించినట్లు ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రి అధికారులు శనివారం తెలిపారు. కొన్నేండ్లుగా ఆయనకు వ్యక్తిగత వైద్యుడిగా ఉన్న డాక్టర్‌ నితీష్ నాయక్ మార్గదర్శకత్వంలోని కార్డియాలజిస్ట్ బృందం మాజీ ప్రధాని ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నదని చెప్పారు. 

ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని, ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నదని, ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ పెరుగుతున్నదని మెడికల్‌ బులిటెన్‌లో పేర్కొన్నారు.

89 ఏండ్ల మన్మోహన్‌ సింగ్‌ జ్వరం, నీరసం వంటి అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్‌లో బుధవారం అడ్మిట్‌ అయ్యారు. కరోనా సెకండ్‌ వేవ్‌లో ఆయనకు వైరస్‌ సోకగా ఎయిమ్స్‌లో చేరారు. గత ఏడాది మే నెలలో ఛాతిలో ఇబ్బంది రావడంలో ఆయనను ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు.

మరోవైపు పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్  చన్నీ, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌తో సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు ఎయిమ్స్‌ను సందర్శించి మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.