బంగ్లాలో ఇస్కాన్, కాళీమాత గుడులపై విధ్వంసం

బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా,  ఇస్కాన్, కాళీమాత దేవాలయాలపై దుండ‌గులు దాడులు జరిపారు.  నౌఖాలీ జిల్లాలో శుక్ర‌వారం ఇస్కాన్ దేవాల‌యంపై దాడి జరిపి, విధ్వంసానికి పాల్పడ్డారు. భ‌క్తుల‌పైన కూడా దాడి చేశారని దేవాలయ అధికారులు ట్విట్టర్ ద్వారా తెలిపారు. గాయ‌ప‌డిన ఒక భ‌క్తుడి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని తెలిపారు. బంగ్లాదేశ్‌లోని హిందువుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు.

మరోవంక,  మున్షీగంజ్‌లోని కాళీ మాత దేవాలయంపై శనివారం తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో కొందరు దుండగులు దాడి చేసి, ఆరు దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. సిరాజ్‌దిఖాన్ సర్కిల్ అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ మహమ్మద్ రషీదుల్ ఇస్లామ్ ఈ సంఘటనను ధ్రువీకరించారు. 

హిందూ దేవాలయాలపై దాడులను తమ ప్రభుత్వం సహించే ప్రసక్తి లేదని, దాడి జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని ప్రధాని షేక్  హసీనా హెచ్చరించిన మరుసటి రోజే ఇటువంటి దాడులు జరగడం గమనార్హం. 

రషీదుల్ ఇస్లామ్ బంగ్లాదేశ్ మీడియాతో మాట్లాడుతూ, మున్షీగంజ్, సిరాజ్‌దిఖాన్ ఉప జిల్లా, రసూనియా యూనియన్‌లోని డానియాపర మహా శోషణ్ కాళీ మందిరంపై శనివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో కొందరు దుండగులు దాడి చేశారన్నారు. ఈ దేవాలయంలోని ఆరు దేవతా విగ్రహాలను ఈ దుండగులు ధ్వంసం చేశారన్నారు. ఈ దేవాలయం వద్ద భద్రతా ఏర్పాట్లు లేవని చెప్పారు.

ఈ దేవాలయం కమిటీ ప్రధాన కార్యదర్శి సువ్రత దేవ్ నాథ్ వను మాట్లాడుతూ, ప్రధాన సింహద్వారం కప్ప తాళాన్ని పగులగొట్టి, టిన్ రేకుల షెడ్‌ను కోసేశారని తెలిపారు. ఈ దేవాలయంలోని అన్ని విగ్రహాలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ దేవాలయంలో ఇటువంటి సంఘటనలు గతంలో ఎన్నడూ జరగలేదని తెలిపారు. 

ఖురాన్‌ పట్ల అపచారం జరిగిందని సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాప్తి చేయడంతో బుధవారం బంగ్లాదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో మత హింస జరిగింది. చాంద్ పూర్, చిట్టగాంగ్, గాజీపూర్, బందర్బన్, చాపయి నవాబ్ గంజ్, మౌల్వీ బజార్లలో దుర్గా పూజ మండపాలపై దాడులు చేసి, నాశనం చేశారు. ఈ సంఘటనల్లో ప్రాణ నష్టం కూడా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. 

నౌఖాలీ జిల్లాలోని బేగంగంజ్‌లో శుక్రవారం జరిగిన మత హింసలో జతన్ కుమార్ సాహా హత్యకు గురయ్యారు. 17 మంది గాయాలపాలయ్యారు. ఈ జిల్లాలో శుక్రవారం కొందరు దుండగులు ఇస్కాన్ టెంపుల్‌పై దాడి చేసి, విధ్వంసం సృష్టించారు. ఈ సంఘటనలో కూడా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారని స్థానికులు చెప్పారు.

ఇటీవ‌ల బంగ్లాదేశ్‌లో వారం రోజులుగా మైనారిటీ అధ్యాత్మిక స్థ‌లాల‌పై దాడులు జ‌రుగుతున్నాయి. ఈ దాడుల్లో ఒక‌రు మ‌ర‌ణించార‌ని, మ‌రో 18 మందికి గాయాల‌య్యాయ‌ని బంగ్లాదేశ్ మీడియాలో వార్త‌లొచ్చాయి.