కరోనా మూలాలను తెలుసుకునేందుకు చివరి ప్రయత్నంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మరోసారి చైనాలో పర్యటించనున్నది. కరోనా వైరస్ ఎక్కడ, ఎలా వ్యాపించిందో తెలుసుకునేందుకు 26 మంది నిపుణులతో సలహా బృందాన్ని డబ్యూహెచ్ఓ ఏర్పాటు చేసింది.
తాజా దర్యాప్తు ద్వారా ‘రాజకీయంగా తారుమారు’కు అవకాశం ఇవ్వడమేనని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ చ్చరించింది. “అంతర్జాతీయ శాస్త్ర దర్యాప్తునకు చైనా మద్దతునిస్తుంది. కానీ రాజకీయంగా తారుమారు చేయడాన్ని వ్యతిరేకిస్తుంది. అన్ని పక్షాల వారు బాధ్యతాయుత శాస్త్రీయ ధోరణితో విలువలను కాపాడాలి” అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి జోవో లిజియాన్ స్పష్టం చేశారు.
ఈ బృందం చైనాలో పర్యటించి కరోనా మూలాలను పునః పరిశీలించనున్నది. ఈ ఏడాది ప్రారంభంలో డబ్ల్యూహెచ్ఓ బృందం 4 వారాల పాటు చైనాలోని వుహాన్ నగరంలో విచారణ నిర్వహించింది. అయితే, ఖచ్చితమైన ఫలితాన్ని పొందలేదు. అందుకని ఈసారి తొలి కేసులకు సంబంధించిన డాటాను అందుబాటులో ఉంచాలని చైనాకు డబ్ల్యూహెచ్ఓ సూచించింది.
కరోనా వైరస్ మూలాన్ని తెలుసుకునేందుకు ఇదే చివరి ప్రయత్నం అని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. చైనాలోని వుహాన్ నగరంలో 2019 డిసెంబర్లో తొలి కరోనా కేసు నమోదైంది. అక్కడి నుంచే కొవిడ్ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిందని అనుమానిస్తున్నారు. వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయిందనే వాదనలు కూడా వినిపించాయి.
అయితే, ఇవన్నీ తప్పుడు మాటలని కొట్టిపారేసిన చైనా.. విచారణ అవసరం లేదని పదేపదే చెప్తూ వచ్చింది. ఇదే సమయంలో డబ్ల్యూహెచ్ఓ బృందం ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన నివేదిక ప్రకారం, కరోనా వైరస్ గబ్బిలాల నుంచి ఇతర జంతువుల ద్వారా మానవులకు వ్యాపించి ఉండవచ్చు. దీనిపై మరింత పరిశోధన అవసరం కాగలదు.
ఇలాఉండగా, చైనాలో ఇప్పటికే రెండుసార్లు కొవిడ్ మూలాలపై డబ్ల్యూహెచ్ఓ పరిశీలించింది. 2019 నుంచి వుహాన్ ల్యాబ్లో భద్రపరిచిన రక్తం నమూనాలను, అక్కడి దవాఖానల్లో మరణించిన వారి డాటాను ఇవ్వాలని డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికే చైనాకు సూచించింది. ఈ నేపథ్యంలో వుహాన్లో కరోనా మూలాలను పునః పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల బృందం చైనాలో పర్యటించడం ఇదే చివరిసారని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా 700 మందిని వడబోసి ప్రపంచ స్థాయి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని 26 మంది నిపుణులను ఎంపిక చేసినట్లు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధానోమ్ గ్రెబ్రేయేసస్ తెలిపారు. ఈ బృందంలో జంతువుల ఆరోగ్యం, క్లినికల్ మెడిసిన్, వైరాలజీ, జెనోమిక్స్కు సంబంధించిన వారు ఉన్నారు.
More Stories
వంతెన ప్రమాదంలో భారతీయుల చొరవకు బిడెన్ ప్రశంస
అసాంజెను అమెరికాకు తక్షణమే అప్పగించలేం
అమెరికాలో కుప్పకూలి నదిలో పడిపోయిన వంతెన