మాస్కోలో తాలిబన్లతో చర్చలకు భారత్

ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రభుత్వాన్ని నడుపుతున్న తాలిబన్లతో చర్చలకు భారత దేశం హాజరవుతుంది. ఈ నెల 20న మాస్కోలో జరిగే ఈ చర్చలకు రష్యా ఆతిథ్యమిస్తుండగా, చైనా, పాకిస్థాన్, ఇరాన్ కూడా హాజరవుతాయి. 

మాస్కో ఫార్మేట్ చర్చలుగా పిలుస్తున్న ఈ సమావేశానికి తాము హాజరవుతామని తాలిబన్లు ప్రకటించినట్లు రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ ఆ దేశ వార్తా సంస్థ తెలిపింది. ఆఫ్ఘనిస్థాన్‌పై తాలిబన్లతో అక్టోబరు 20న జరిగే మాస్కో ఫార్మేట్ చర్చలకు హాజరవుతున్నట్లు భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది.

భారత్-తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వం మధ్య అధికారికంగా జరిగే తొలి చర్చలు ఇవే అవుతాయి. ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లతో భారత్ దోహాలో ఆగస్టు 31న తొలిసారి మాట్లాడింది.

మరోవంక,   ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌కు విమానాలు రద్దు చేస్తూ పాకిస్థాన్ నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగానే పాక్ తమ విమానాలను రద్దు చేసినట్టు తెలుస్తోంది. నేటి నుంచే కాబూల్‌కు విమానాలు రద్దు చేస్తున్నట్టు పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. 

టికెట్ ధరలను తగ్గించాలని, ఆగస్టు 15 నాటి ముందునాటి ధరలను అమలు చేయాలని తాలిబన్ ప్రభుత్వం ఆదేశించింది. లేదంటే విమాన సర్వీసులను నిలిపివేస్తామని ఆఫ్ఘనిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (ఏసీఏఏ) హెచ్చరించింది. 

ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌కు పాకిస్థాన్ నుంచి మాత్రమే విమాన సర్వీసులు ఉన్నాయి. ఇస్లామాబాద్-కాబూల్ మధ్య తాలిబన్లు హస్తగతం చేసుకోవడానికి ముందు 120-150 డాలర్ల మధ్య టికెట్ ధరలు ఉండేవి. ప్రస్తుతం 2,500 డాలర్లకు విక్రయిస్తున్నారు. టికెట్ ధరలను మరీ అంతగా తగ్గించడం సాధ్యం కాకపోవడంతో విమానాలను నిలిపివేస్తున్న పీఐఏ పేర్కొంది.