బంగ్లాదేశ్‌లోని పూజా మండపాలపై దాడులు.. ముగ్గురి మృతి

బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకుని కొందరు దాడులకు పాల్పడ్డారు. దుర్గా పూజ సందర్భంగా ఏర్పాటుచేసిన మండపాలు లక్ష్యంగా దాడులు జరిగాయి. మండపాలలో ఏర్పాటుచేసిన పలు హిందూ దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల్లో ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు.

బంగ్లాదేశ్‌లో విజయదశమిని పురస్కరించుకుని ఎప్పటిమాదిరిగానే హిందూ సంస్థలు మండపాలను ఏర్పాటుచేసి నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాయి. ఈ పూజలంటే గిట్టని చాందసవాదులు చంద్‌పూర్ జిల్లాలోని హిందూ దేవాలయంపై గుంపు దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో కాల్పులు చోటుచేసుకోవడంతో ముగ్గురు హతమయ్యారు. 

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దేవాలయాలపై ఇలాంటి దాడులు జరిగినట్లు సమాచారం అందింది. బంగ్లాదేశ్‌ చరిత్రలో ఇది దుర్దినం అని, ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని బంగ్లాదేశ్‌ హిందూ యూనిటీ కౌన్సిల్‌ విజ్ఞప్తిచేసింది.

బంగ్లాదేశ్‌లోని హిందువులకు భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనాను బంగ్లాదేశ్ హిందూ యూనిటీ కౌన్సిల్‌ డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్ ముస్లింలు కోరుకోకపోతే హిందువులు పూజలు చేయరని, ఇదే సమయంలో సైన్యాన్ని రంగంలోకి దించైనా ఇక్కడి హిందువులను రక్షించాలని కౌన్సిల్ ట్వీట్ చేసింది.

కుమిల్లలోని దుర్గాపూజా మండపంలో ఖురాన్‌ను అపవిత్రం చేసినట్టు వదంతులు వ్యాప్తి చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపించాయి. దీంతో రెచ్చిపోయిన కొందరు దుర్గా మండపాలను లక్ష్యంగా చేసుకుని చెలరేగిపోయారు. వారిని పోలీసులు కూడా నియంత్రించలేకపోయారు. 

కుమిల్ల విధ్వంసం, హింస తర్వాత చాంద్‌పూర్‌లోని హాజిగంజ్, చత్తోగ్రామ్‌లోని బన్ష్‌కాళి కోక్స్‌బజార్‌లోని పెకువాలకూ పాకింది. హింస చెలరేగిన ప్రాంతాల్లో ప్రభుత్వం పారామిలిటరీ బలగాలను మోహరించింది. 

దేవి మండపాలపై జరిగిన దాడికి సంబంధించిన ఫొటోలను బంగ్లాదేశ్ హిందూ యూనిటీ కౌన్సిల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. బంగ్లాదేశ్ చరిత్రలోనే ఇదో అపకీర్తి మూటగట్టుకున్న ఘటన ఇదని, గత 24 గంటల్లో ఏం జరిగిందనేది ఒక్క ట్వీట్‌లో చెప్పలేమని కౌన్సిల్ ట్వీట్ చేసింది.

ప్రజల నిజస్వరూపాన్ని బంగ్లాదేశ్‌లోని హిందువులు ఇప్పుడు చూస్తున్నారని పేర్కొంది. ఢాకాలోని టిప్పు సుల్తాన్ రోడ్డు, కొత్వాలి, చిట్టగాంగ్‌లోనూ ఇలాంటి ఘటనలే జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.