మంత్రులు  ఉత్సవ విగ్రహాలు…. అన్ని శాఖలు సజ్జలకే!

వై  ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులందరూ ఉత్సవ విగ్రహాలుగా మారుతుంటే, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం అన్ని శాఖలలో జోక్యం చేసుకొంటున్నాడనే విమర్శలు చెలరేగుతున్నాయి. పైగా, ఆయా మంత్రులు చేయవలసిన విధానపరమైన ప్రకటనలు కూడా ఆయనే చేస్తున్నారు. 
 
ఇప్పటికే సూపర్‌ హోంమంత్రిగా ఉన్న ఆయన, విద్యుత్‌ తదితర శాఖలన్నీ చూస్తున్నారని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ధ్వజమెత్తారు.  చివరికి ప్రభుత్వోద్యోగులు సైతం సీఎం తరఫున సజ్జలతోనే సమావేశమయ్యారని గుర్తు చేశారు. సాధారణ పరిపాలన పరిధిలోకి వచ్చే అంశాలనూ ఆయనే చూస్తుండటం పట్ల విచారం వ్యక్తం చేశారు. సకల శాఖల మంత్రిగా సకల విషయాలూ ఆయనే చూస్తారా అని ప్రశ్నించారు. 
 
కాగా,  రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా సమకూరుతున్న ఆదాయ, వ్యయాలను గణిస్తే రూ.91వేల కోట్లకు లెక్కలు తేలడంలేదని ఆయన ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ఆదాయం, అప్పులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలతో అధికారికంగా శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఈ రెండున్నరేళ్లలో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.2,94,000 కోట్లు, చేసిన ఖర్చు రూ.4,50,000 కోట్లు కాగా. తెచ్చిన అప్పులు రూ.2,87,000 కోట్లన్నారు. లెక్కల్లో తేలని నిధులు రూ.1,31,000 కోట్లని, అయితే కార్పొరేషన్ల ద్వారా సుమారు రూ.40వేల కోట్లు అప్పు చేశారని, దాన్ని మినహాయిస్తే అసలు లెక్కతేలని సుమారు రూ.91వేల కోట్లు కనిపిస్తోందని రాజు వివరించారు.

 రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా అమ్మఒడి పథకం ఘోరంగా విఫలమవుతోందని, నవరత్నాల్లో ప్రధానమైన ఈ పథకంలో ఇప్పుడు ఒక రత్నం రాలిపోతోందని రఘురామరాజు విమర్శించారు. జనవరిలో ఇవ్వాల్సిన నిధులను పిల్లల హాజరును చూసుకుని వచ్చే జూన్‌లో ఇవ్వనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటించడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. 

మరోవంక,  రాష్ట్రంలో విద్యుత్‌ కష్టాలకు ప్రభుత్వ పరిపాలనా రాహిత్యమే కారణమని రఘురామ ధ్వజమెత్తారు. ఏప్రిల్‌ 1 నాటికి తమవద్ద 100మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, అవసరమైనవారు ఇండెంట్‌ పెట్టుకుని తీసుకోవచ్చని రాష్ట్రాలకు కోల్‌ ఇండియా లేఖలు రాసినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన గుర్తు చేశారు.

కోల్‌ఇండియాకు ఏపీ సర్కారు దాదాపు 300కోట్లు బాకీ ఉందని ఆయన చెప్పారు. బాకీ చెల్లించి, బొగ్గు తెచ్చుకోవడంలో జగన్‌ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. ఇలా ఉండగా, కనకదుర్గమ్మ దర్శనానికి సీఎం సతీసమేతంగా కాకుండా ఒక్కరే వెళ్లడంపై విమర్శలు వస్తున్నాయని ఆయన పేర్కొరు. దీన్ని గమనించిన అమ్మవారే ఉరుములు వర్షంతో దేవాలయాన్ని సంప్రోక్షణ చేసినట్లు పలువురు స్వాములు, సిద్ధాంతులు త మ సనాతన స్వదేశీ సేనకు తెలియజేసినట్లు వివరించారు.