అస్వస్థతకు గురైన మాజీ ప్రధాని మన్మోహన్‌

మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. వైద్య బృందం ఫ్లూయిడ్స్‌ ఇస్తున్నది. డాక్టర్‌ రణదీప్‌ గులేరియా నేతృత్వంలోని ఎయిమ్స్‌ వైద్యుల బృందం మాజీ ప్రధానికి చికిత్సలు అందిస్తున్నది. 

జ్వరంతో పాటు శ్వాస సమస్యలు, చెస్ట్‌ పెయిన్‌ ఉన్నట్లు తెలుస్తున్నది.  మన్మోహన్‌ సింగ్‌ ఈ ఏడాది ఏప్రిల్ 19న కరోనా బారినపడ్డారు. జ్వరం ఉండడంతో ఎయిమ్స్‌లో చేర్పించిన సమయంలో కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. అంతకు ముందు మార్చి 4న, ఏప్రిల్‌ 3న కొవిడ్‌ టీకా తీసుకున్నారు. బుధవారం సాయంత్రం హుద్రోగా విభాగంలో చేరిన ఆయనకు డా. నితీష్ నాయక్ నేతృత్వంలోని వైద్య బృందం చికిత్సలు అందిస్తున్నది.

సీనియర్‌ కాంగ్రెస్‌ నేత అయిన మన్మోహన్‌ సింగ్‌.. ప్రస్తుతం రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2004-2014 వరకు భారత ప్రధానిగా సేవలందించారు. 2009లో ఎయిమ్స్‌లో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. మాజీ ప్రధాని వేగంగా కోలుకోవాలని జాతి ప్రార్థిస్తున్నట్లు కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ లో పేర్కొన్నది.

మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ త్వరగా కోలుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ తన ట్వీట్టర్ లో.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు మంచి ఆరోగ్యం కలగాలి. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న అని ట్వీట్ చేశారు. కాగా, ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న మన్మోహన్‌ సింగ్‌ ను గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్​ మాండవియా పరామర్శించారు.