చిన్నారులకు కరోనా టీకాకు అనుమతి

దేశంలో చిన్నారులకు తొలి కరోనా టీకా అందుబాటులోకి వచ్చింది. అత్యవసర వినియోగానికి భారత్ బయోటెక్ ‘కొవాగ్జిన్‌’కు కేంద్రం అనుమతి ఇచ్చింది. 2 నుంచి 18 ఏళ్ల లోపు చిన్నారులకు కొవాగ్జిన్ వేసేందుకు అనుమతిచ్చింది. కేంద్రానికి సంబంధించిన భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ మంగళవారం కొవాగ్జిన్‌ టీకాకు అనుమతి ఇచ్చింది. 
 
మొత్తం ప్రపంచంలోనే ఈ వయస్సులోని వారికి అనుమతి లభించిన మొదటి టీకా ఇది కావడం విశేషం. గత నెలలో పిల్లలపై రెండు, మూడు దశల్లో ప్రయోగాలు చేసి.. ఆ వివరాలను వ్యాక్సిన్ సంస్థ డీసీజీఐ తెలియజేస్తూ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. దీన్ని పరిశీలించిన  డీసీజీఐ ఈ మేరకు అనుమతి ఇచ్చింది.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు చిన్నపిల్లల కోసం కొవాగ్జిన్‌‌కు అనుమతి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.  28 రోజుల వ్యవధితో రెండు డోసులుగా కొవాగ్జిన్ ఇచ్చే అవకాశం ఉంది. 
 
18 ఏళ్లు పైబడిన వారికి 4 నుంచి 6 వారాల గ్యాప్‌లో రెండు డోసుల వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇంతకుముందు, 12 ఏళ్లు, ఆ పైబడిన వారి కోసం జైకోవ్-డికి డ్రగ్స్ రెగ్యులేటర్ అనుమతి ఇచ్చినప్పటికీ, సరఫరా ఇంకా మొదలు కాలేదు.

“అయితే అత్యవసర వినియోగ అధికారం కొన్ని షరతులకు లోబడి ఉంటుందని డిజిసిఐ స్పష్టం చేసింది. కోవాక్సిన్ డెవలపర్ హోల్ వైరియన్, ఇన్‌యాక్టివేటెడ్ కరోనా వైరస్ వ్యాక్సిన్ ఆమోదించిన క్లినికల్ ట్రయల్ ప్రోటోకాల్ ప్రకారం అధ్యయనం కొనసాగిస్తారని తెలిపింది. అయితే ఉత్పత్తి ప్రారంభించడానికి ముందు మరిన్ని నియంత్రణపరమైన అనుమతుల కోసం చూస్తున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది.