లఖీంపూర్ ఖేరీ ఘటనలో కేంద్ర మంత్రి కొడుకు అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరిలో ఘటనలో రైతులపైకి అమానుషంగా కారు నడిపించి పలువురి మరణానికి కారకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను గత రాత్రి  పొద్దుపోయాక పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు 12 గంటల పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయనను ప్రశ్నించింది. 

లఖీంపూర్ ఖేరి సంఘటన జరిగిన రోజునుంచి కనిపించకుండా పోయిన ఆయన శనివారం విచారణ నిమిత్తం పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు హాజరయ్యారు. తొలుత సమన్లు జారీ చేసినప్పటికీ ఆశిష్ మిశ్రా విచారణ కోసం సిట్ ఎదుట హాజరు కాకపోవడంతో మరో సారి సమన్లు జారీ చేయాల్సి వచ్చింది.

విచారణ సందర్భంగా ఆశిష్‌ తమకు సహకరించలేదని, దీంతో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని డీఐజీ ఉపేంద్ర అగర్వాల్‌ చెప్పారు. ప్రత్యేకించి సంఘటన జరిగిన 3వ తేదీ మధ్యాహ్న 2:36 గంటల నుండి 3:30 గంటల వరకు తానెక్కడున్నది అతను చెప్పలేకపోయాడని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

పెన్‌ డ్రైవ్‌లో తన వెంట తెచ్చుకును వీడియోలను ఆశిష్‌ సిట్‌కు అందజేశారు. అతని  ఫోన్‌ ను కూడా పోలీసులు తీసుకున్నారు. ఈ సంఘటన జరిగిన సమయంలో తను మరొక చోట ఉనుట్లు చెప్పుకొచ్చాడు. కేసు నమోదు చేసిన తరువాత ఎక్కడకు వెళ్లావు? ఎవరిని కలిశావు? ఫోన్‌ ఎందుకు స్వీచ్‌ ఆఫ్‌ చేశావు? వంటి ప్రశ్నలను సిట్‌ బృందం సంధించింది.

ఈ సమన్లకు స్పందించిన ఆశిష్ శనివారం ఉదయం పదిన్నర గంటల సమయంలో లఖింపూర్‌లోని క్రైబ్రాంచ్ కార్యాలయానికి వచ్చారు. దాదాపు 9 గంటల పాటు సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించారు. రాత్రి 8 గంటల తర్వాత కూడా విచారణ కొనసాగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆశిష్ మిశ్రా రాక సందర్భంగా ఆ ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసులను మోహరించడంతో పాటుగా బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపి వేశారు.