సకాలంలో జీతాలివ్వక ఉద్యోగులతో కన్నీళ్లు పెట్టిస్తున్న కేసీఆర్

5వ తేదీలోగా జీతమందితే గానీ జీవనం గడవని దుస్థితిలో ఉన్న  ఉద్యోగులకు సకాలంలో జీతాలివ్వనికి కేసీఆర్ ప్రభుత్వాన్ని యావత్ తెలంగాణ ప్రభుత్వ, కాంట్రక్టు, ఇతర ఉద్యోగులు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారని  బిజెపి నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి హెచ్చరించారు. 
దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పే రాష్ట్ర సర్కార్రా ష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకని సకాలంలో జీతాలు అందించడం లేదో తెలపాలని ఆమె డిమాండ్ చేశారు. పథకాల అమలుకు, ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహణ చేసే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, సెర్చ్ ఉద్యోగులపై టీఆర్ఎస్ సర్కార్ చిన్న చూపు చూస్తూ సకాలానికి జీతాలు ఇవ్వకుండా కన్నీళ్లు పెట్టిస్తోందని ఆమె ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో అతిపెద్ద పండుగగా భావించే బతుకమ్మ సంబురం మొదలుకావడంతో ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషం లేకుండా చేస్తుందని, పండగ పూట చేతిలో డబ్బు లేక ఆందోళన పడాల్సిన దుస్థితి దాపురించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు నాలుగో తరగతి ఉద్యోగులకు ప్రతి నెల 14నుంచి 20 వరకు వేతనాలు జమకాని పరిస్థితులు ఏర్పడ్డాయంటే రాష్ట్ర సర్కార్ ఉద్యోగులపై ఎంత చిత్త శుద్ధి కనబరుస్తుందో అర్ధమవుతోందని ఆమె మండిపడ్డారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగైందంటూనే జీతాలను ఆలస్యం చేస్తూ దాదాపు ఆరునెలల నుంచి వేతనాలను జిల్లాల వారీగా ఇస్తోందని ఆమె చెప్పారు. ఇప్పుడు పండుగల సమయంలో కూడా పాత పద్ధతినే అమలు చేస్తామని ఉన్నతాధికారుల ద్వారా వెల్లడించడం సిగ్గుచేటని ఆమె విమర్శించారు.
పట్టభద్రుల ఎన్నికలప్పుడు పీఆర్సీ పెంచుతాం, జీతాలు పెచుతాం అని ఓట్లు పొందడమే కానీ ఇప్పటి వరకూ పెంచిన జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులకు మినహా, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‌తో  పాటు హోంగార్డులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలకు పెరిగిన వేతనాలు అందించకుండా పాత వేతనాలనే విడుదల చేస్తోందని ఆమె పేర్కొన్నారు.
ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇవ్వకుండా, వేతనాల పెంపుపై జీవోలు జారీ చేయకుండా ఉద్యోగులను అన్యాయం చేస్తుందని విజయశాంతి మండిపడ్డారు. కేవలం హుజురాబాద్ ఉప ఎన్నికపై ఓటమి భయంతో ఉన్న రాష్ట్ర సర్కార్. అక్కడి ఓటర్లకు గాలం వేయడానికి డబ్బును, మద్యాన్ని, దావత్‌లను ఇస్తూ డబ్బు ఖర్చు చేస్తుందే కానీ ఉద్యోగుల జీతభత్యాలపై ఏ చీకు చింతా లేదని ఆమె ధ్వజమెత్తారు.