బిజెపి కార్యవర్గంకు స్వామి, మేనకా, వరుణ్ ల ఉద్వాసన 

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా 80 మంది సభ్యులతో ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో బిజెపి ప్రభుత్వ విధానాలను తరచూ విమర్శిస్తున్న రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి డా. సుబ్రమణియన్ స్వామి,  రైతు ఉద్యమంపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రకటనలు చేస్తున్న వరుణ్‌గాంధీ, ఆయనతో పాటు మాజీ కేంద్ర మంత్రి అయిన తల్లి మేనకాగాంధీలకు అవకాశం ఇవ్వలేదు.

సుల్తాన్‌పూర్ నుంచి లోకసభ ఎంపీగా మేనకగాంధీ, ఫిల్‌భిత్‌ను నుంచి ఆమె కుమారుడు వరుణ్‌గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బహిరంగంగా పార్టీ, ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేసేవారికి గట్టి హెచ్చరిక ఇవ్వడంకోసమే ఈ చర్య తీసుకొన్నట్లు కనిపిస్తున్నది.

బీజేపీ జాతీయ కార్యవర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి ప్రముఖులతోపాటు కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, అశ్విని వైష్ణవ్‌, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, నిర్మల సీతారామన్, స్మృతి ఇరానీ, కేంద్ర మాజీ మంత్రులు రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రకావ్‌ జావదేకర్‌, డా. హర్షవర్ధన్ లకు చోటు దక్కింది.

ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణా బీజేపీ నేతలు విజయశాంతి, ఈటల రాజేందర్ నియమితులయ్యారు. కార్యవర్గ సభ్యులుగా మాజీ మంత్రి, ఏపీలో మాజీ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, జి వెంకటస్వామి, గరికపాటి మోహన్ రావులకు చోటు దక్కింది. ఇప్పటికే డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా, డి పురందేశ్వరి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 

జేపీ నడ్డా విడుదల చేసిన 80 మంది సాధారణ సభ్యులతో పాటు మరో 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు, 179 మంది శాశ్వత ఆహ్వానితులు కూడా ఉంటారు. కరోనా మహమ్మారి కారణంగా  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం చాలా కాలం పాటు జరుగలేదు. గత జాతీయ కార్యవర్గ సమావేశం 2019 జనవరిలో జరిగింది.

 ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, అసెంబ్లీ, కౌన్సిల్స్‌లో సభా పక్ష నాయకులు , మాజీ ముఖ్యమంత్రులు, మాజీ ఉప ముఖ్యమంత్రులు, జాతీయ అధికార ప్రతినిధులు, జాతీయ మోర్చా అధ్యక్షులు  తదితరులకు ఈ కమిటీలో అవకాశం కల్పించారు.