ముగ్గురు శాస్త్ర‌వేత్త‌ల‌కు భౌతికశాస్త్ర నోబెల్‌

ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ ముగ్గురు శాస్త్ర‌వేత్త‌ల‌ను వ‌రించింది. సంక్లిష్ట భౌతిక వ్య‌వ‌స్థ‌ల‌పై మ‌న అవ‌గాహ‌న‌కు సంబంధించి వీళ్లు చేసిన ర‌చ‌న‌ల‌కుగాను ఫిజిక్స్ నోబెల్‌ను ప్ర‌క‌టించారు. స్యుకురో మ‌నాబె, క్లాస్ హాసెల్‌మాన్‌, గియోర్గియో పారిసిల‌కు ఫిజిక్స్ నోబెల్ ఇస్తున్న‌ట్లు రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. 

నోబెల్ బ‌హుమ‌తితోపాటు ఇచ్చే ప్రైజ్‌మ‌నీలో స‌గం పారిసికి, మిగ‌తా స‌గం మాన‌బె, హాసెల్‌మాన్‌ల‌కు ఇవ్వ‌నున్న‌ట్లు అకాడ‌మీ తెలిపింది. ఈ ఏడాది ఫిజిక్స్ నోబెల్ గెలిచిన పారిసి.. క్ర‌మ‌ర‌హిత సంక్లిష్ట ప‌దార్థాల‌లో దాగి ఉన్న న‌మూనాల‌ను క‌నుగొన్నారు. సంక్లిష్ట వ్య‌వ‌స్థ‌ల సిద్ధాంత ర‌చ‌న‌ల‌కు అత‌ని ఆవిష్క‌ర‌ణ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ని రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ తెలిపింది.

ఇక వాతావ‌ర‌ణం, ప‌ర్యావ‌ర‌ణాన్ని కలిపే మోడ‌ల్‌ను సృష్టించిన క్లాజ్ హాసెల్‌మాన్‌ను కూడా ఈ ఏడాది ఫిజిక్స్ నోబెల్ వ‌రించింది. మ‌నుషుల కార‌ణంగా ఉత్ప‌న్న‌మ‌వుతున్న కార్బ‌న్‌డైఆక్సైడ్ వ‌ల్లే ఉష్ణోగ్ర‌త‌లు పెరిగిపోతున్నాయ‌ని ఆయ‌న ప‌ద్ధ‌తులు నిరూపిస్తున్నాయి.

వాతావ‌ర‌ణంలో కార్బ‌న్‌డైఆక్సైడ్ స్థాయులు పెరిగిన కొద్దీ భూ ఉప‌రిత‌ల ఉష్ణోగ్ర‌త‌లు ఎలా పెరుగుతున్నాయో నిరూపించిన స్యుకురో మ‌నాబెను కూడా ఈసారి ఫిజిక్స్ నోబెల్‌కు ఎంపిక చేశారు. ప్ర‌స్తుత ప‌ర్యావ‌ర‌ణ మోడ‌ల్స్‌ను రూపొందించ‌డానికి ఆయ‌న ర‌చ‌న‌లు ఓ ఫౌండేష‌న్‌లా ప‌ని చేసిన‌ట్లు స్వీడిష్ రాయ‌ల్ అకాడ‌మీ తెలిపింది.