ఐక్య రాజ్య సమితికి భారత దేశ శాశ్వత మిషన్లో కౌన్సెలర్ ఏ అమర్నాథ్ మాట్లాడుతూ, న్యూక్లియర్ మెటీరియల్ను, టెక్నాలజీని అక్రమంగా ఎగుమతి చేసే ట్రాక్ రికార్డుగల దేశం నుంచి భారత దేశానికి సలహాలు అవసరం లేదని ఎద్దేవా చేశారు. తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేయడానికి పాకిస్థాన్ నైరాశ్యంతో చేసే ప్రయత్నాలను, వివిధ దేశాల వేదికల ప్రాధాన్యాన్ని దుర్వినియోగం చేసే అలవాటును సమష్టిగా ధిక్కరించాలని పిలుపిచ్చారు.
భారత్పై అనేక నిష్ఫలమైన, నిరాధారమైన ఆరోపణలను పాకిస్థాన్ చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ-కశ్మీరు, లడఖ్ విషయంలో కూడా నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. ఈ ఆరోపణలపై స్పందించవలసిన అవసరం భారత్ కు లేదని తిప్పికొట్టారు. ఆ అంశాలు భారత దేశ అంతర్గత వ్యవహారాలని ఆయన స్పష్టం చేశారు.
ఐక్యరాజ్య సమితికి పాకిస్థాన్ దౌత్యవేత్త మునీర్ అక్రమ్ నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రత సమస్యలపై చర్చించే సాధారణ సభ ఫస్ట్ కమిటీ సమావేశంలో జమ్మూ-కశ్మీరు అంశాన్ని లేవనెత్తారు. దీనిపై సమాధానం చెప్పే హక్కును భారత దేశం వినియోగించుకుంది.
జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతం గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో భారత దేశ అంతర్బాగమని, విడదీయరాని భాగమని అమర్నాథ్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ అక్రమ ఆక్రమణలో ఉన్న ప్రాంతాలు కూడా భారత దేశంలో భాగమేనని ఆయన తెలిపారు. తన దురాక్రమణలో ఉన్న అన్ని ప్రాంతాలను తక్షణమే పాకిస్థాన్ ఖాళీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వడం, సహాయపడటం, చురుగ్గా మద్దతివ్వడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు స్పష్టంగా వెల్లడవుతోందని ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. అటువంటి దేశం అంతర్జాతీయ శాంతి, భద్రతల గురించి చర్చించే ఫస్ట్ కమిటీకి నిర్మాణాత్మకంగా సహకరిస్తుందని ఎవరైనా ఎలా ఆశించగలరని అని ప్రశ్నించారు.
భారత దేశం చాలా బాధ్యతాయుతమైన దేశమని, అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం నిర్వహించవలసిన బాధ్యతలకు కట్టుబడి ఉంటుందని ఆయన చెప్పారు. భారత దేశ ఆయుధాల గురించి పాకిస్థాన్ దౌత్యవేత్త ప్రస్తావించిన నేపథ్యంలో అమర్నాథ్ ఈ విధంగా బదులిచ్చారు.
More Stories
ఉక్రెయిన్లో నాలుగు పవర్ ప్లాంట్లు ధ్వంసం
సియాచిన్ గ్లేసియర్ వద్ద చైనా సరికొత్త రాదారి
లండన్ భారత హైకమిషన్పై దాడి నిందితుడి అరెస్ట్