రైతు సంఘాల ఆందోళనలపై మండిపడ్డ సుప్రీంకోర్టు

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపడుతున్న ఆందోళనలపై సుప్రీంకోర్టు మండిపడింది. మీరు నగరం మొత్తాన్ని ఊపిరి ఆడకుండా చేస్తున్నారని, హైవేలను దిగ్బంధిస్తున్నారని విమర్శించింది. జంతర్‌ మంతర్‌ వద్ద సత్యాగ్రV్‌ా నిర్వహించేందుకు సుప్రీంకోర్టు అనుమతినివ్వాలంటూ రైతు సంఘం కిసాన్‌ మహాపంచాయత్‌ అత్యున్నత ధర్మాసనాన్ని ఆశ్రయించింది. 
జంతర్‌ మంతర్‌ వద్ద శాంతియుతంగా, హింసకు తావునివ్వకుండా సత్యాగ్రహన్ని నిర్వహించుకునేందుకు 200 మంది రైతులకు లేదా ఆందోళనకారులకు అనుమతినిచ్చేందుకు కొంత ప్రాంతం కేటాయించాలని అధికారులకు ధర్మాసనం ఆదేశాలివ్వాలని సంఘం కోరింది. 
 
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎఎం ఖాన్విల్కర్‌, సిటి రవికుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం ‘నగరం మొత్తాన్ని ఊపిరాడనివ్వకుండా చేస్తున్నారు. ఇక నగరంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఇన్ని జనావాసాల మధ్య.. మీరు చేపట్టే ఆందోళనతో వారంతా ఆనందంగా ఉంటారా… ఇటువంటి కార్యాకలాపాలను ఆపండి’ అని పేర్కొంది.

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఒకసారి కోర్టును ఆశ్రయించినట్లయితే… జ్యుడిషియల్‌ వ్యవస్థపై నమ్మకముంచాలని రైతు సంఘానికి సూచించింది. దీనిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ‘కోర్టుపై విశ్వాసముంటే.. ఆందోళనకన్నా అత్యవసర విచారణ కోసం ఆలోచించండి. మీరు న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా కూడా ఆందోళనలు చేపడదామని అనుకుంటున్నారా?’ అని ప్రశ్నించింది. 
 
రోడ్లను దిగ్బంధించి… మీరు శాంతియుత నిరసనలని చెబుతున్నారని, అదేవిధంగా ప్రజలకు కూడా తిరుగాడే హక్కులు ఉన్నాయన్న విషయాన్ని విస్మరించకూడదని పేర్కొంది. ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, భద్రతాపై కూడా ప్రభావం చూపుతున్నారని, మీరు రక్షణ సిబ్బందిని కూడా నిలువరిస్తున్నారని జస్టిస్‌ ఖన్విల్కర్‌ పేర్కొన్నారు. 
 
అయితే తాము హైవేలను దిగ్బంధించడం లేదని, మమ్మల్నే పోలీసులు అక్కడ అడ్డుకుంటున్నారని రైతు సంఘం తరుపు న్యాయవాది.. సుప్రీంకోర్టుకు విన్నవించారు. అయితే జాతీయ రహదారుల దిగ్బంధనాల విషయంలో తాము భాగం కాదని అఫిడవిట్‌ దాఖలు చేయాలని రైతు సంఘాన్ని కోర్టు కోరింది.