చైనా ఎన్‌బిఎఫ్‌సిపై ఇడి దాడిలో రూ 131 కోట్లు స్వాధీనం

చైనా ఆధీనంలోని ఎన్‌బిఎఫ్‌సికి చెందిన రూ 131కోట్లకు పైగా నిధులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) గురువారం స్వాధీనపర్చుకుంది. ఈ బ్యాంకింగేతర ఆర్థిక లావాదేవీల కంపెనీ తీవ్రస్థాయిలో విదేశీ మారకద్రవ్య చట్టాలను ఉల్లంఘించిందనే ఆరోపణలు వచ్చాయి.

ఈ పిసి ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట ఉన్న ఈ సంస్థ తక్షణ వ్యక్తిగత సూక్ష్మస్థాయి రుణాలు అందిస్తోంది. అయితే తమ క్యాష్‌బియాన్ మొబైల్ యాప్ ద్వారా విదేశీ మారకద్రవ్యపు అక్రమాలకు పాల్పడుతోందని అభియోగాలు వెలువడ్డాయి. సంబంధిత అంశంపై కేసు దాఖలు అయింది. 

ఈ యాప్ ద్వారా విదేశీ సంస్థలకు చెల్లింపులు జరుగుతున్నాయని, ఈ క్రమంలో ఫారెన్ ఎక్సేంజ్ నిబంధనలను తుంగలో తొక్కారని తెలియడంతో ఇడి ఈ సంస్థపై విడిగా మనీలాండరింగ్ నిరోధక చట్టం పరిధిలో విచారణ చేపట్టింది. ఇప్పుడు జరిపిన సోదాల క్రమంలో నిధులను జప్తు చేసింది.

ఈ సంస్థ రుణాల జారీలో కూడా పలు రకాల అవకతకవకలకు పాల్పడుతోంది. అత్యధిక స్థాయిలో వడ్డీలు , కస్టమర్ల వ్యక్తిగత సమాచారం తీసుకోవడం, వారిని కాల్‌సెంటర్ల ద్వారా ఎప్పటికప్పుడు దుర్భాషలాడటం వంటి పలు వేషాలకు దిగుతోంది. పలు రాష్ట్రాలలో ఈ సంస్థ కార్యకలాపాలపై ఫిర్యాదులు అందాయి. 

కరోనా దశలో లాక్‌డౌన్లు, జనం కట్టడి వ్యాపార వాణిజ్య లావాదేవీలకు విఘాతం ఏర్పడిన తరుణంలోనే ఇటువంటి సంస్థలు ఖాతాదార్లపై అత్యంత హేయమైన రీతిలో దౌర్జన్యాలకు పాల్పడటం, మానసికంగా చిత్రహింసలకు గురి చేయడం వంటి ఘటనలు జరిగాయి. ఈ దశలో కొందరు వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు తీసుకొన్నారు. 

ఇటువంటి పిసిఎఫ్‌లు భారత్‌కు వెలుపల పలు భారీ డబ్బులను అక్రమంగా చెల్లిస్తున్నట్లు కనుగొన్నారు. ఉనికిలో లేని సాఫ్ట్‌వేర్, మార్కెటింగ్ సంస్థల పేరిట దిగుమతులని తెలిపి తమ సంబంధిత విదేశీ కంపెనీల ఖాతాలకు నిధులను తరలిస్తున్నాయి. ఈ క్రమంలో భారీ స్థాయిలో విదేశీ మారకం నిబంధనలు ఉల్లంఘించారు.