టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌పై భూఆక్రమణ కేేసు

అమర రాజా సంస్థల భూ ఆక్రమణలకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌పై కేేసు నమోదైంది. ఆయనతో పాటు తల్లిదండ్రులు గల్లా అరుణ కుమారి (మాజీ మంత్రి), గల్లా రామచంద్ర నాయుడు సహా 12 మందిపై కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా తవణంపల్లె పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వివిధ సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. 
 
గల్లా అరుణకుమారి తండ్రి దివంగత రాజగోపాల్‌నాయుడు పేరిట ఏర్పాటు చేసిన రాజన్న ట్రస్ట్‌, ఎడ్యుకేషన్‌ సొసైటీల కోసం దిగువమాఘం గ్రామంలో భవనాలు నిర్మించారు. ఆ భవనాల సమీపంలో ఉన్న తన పొలాన్ని ఆక్రమించి భారీ ఎత్తున ప్రహరీ నిర్మించారని అదే గ్రామానికి చెందిన గోపికృష్ణ  అనే రైతు ఫిర్యాదు చేశారు.
 
తన భూమికోసం ఆయన 2015 నుంచి పోరాడుతున్నా ఫలితం లేకపోవడంతో 2 నెలల కిందట కోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన చిత్తూరు నాలుగో అదనపు జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు సదరు ట్రస్ట్‌ సంబంధీకులతో సహా ఆ గ్రామ బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. 
దీంతో భారత శిక్ష్మా స్మృతిలోని 109, 120బి, 430, 447, 506, ఆర్‌/డబ్ల్యూ149 ఐపిసి ఆర్‌/డబ్ల్యూ 156(3) సిఆర్‌పిసి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
 
రాజన్న ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ, చైర్‌పర్సన్‌ గల్లా అరుణకుమారి, సభ్యులు గల్లా రామచంద్రనాయుడు, టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌, గల్లా పద్మావతి, గోగినేని రమాదేవి, కార్యదర్శి సి.రామచంద్రరాజు, ఉద్యోగులు ఎం.పార్థసారధి , భక్తవత్సలనాయుడు, ఎం.మోహన్‌బాబు, న్యాయవాది చంద్రశేఖర్‌, సర్పంచ్‌, కార్యదర్శిపై కేసులు నమోదు చేసినట్టు చిత్తూరు డిఎస్‌పి సుధాకర్‌ వెల్లడించారు.