టీటీడీలో తప్పులు జరిగితే వేంకటేశ్వరస్వామి ఎవరిని ఉపేక్షించరని సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. తిరుమలలో ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరగడం లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై బుధవారం విచారణ జరిగింది.
కేసు విచారణ సమయంలో సీజేఐ ఎన్వీ రమణ తెలుగులో మాట్లాడుతూ తాను కూడా వేంకటేశ్వర స్వామి భక్తుడినని ఆయన తెలిపారు. ‘‘పూజలు సక్రమంగా జరగకపోతే వెంకటేశ్వరస్వామి ఉపేక్షించరు. ఆయన మహిమలు అందరికీ తెలుసు‘‘ అని సీజేఐ పేర్కొన్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి నిర్వహిస్తున్న వివిధ రకాల సేవలు ఆగమ శాస్త్రం ప్రకారం జరగడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీవారి భక్తుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో హిందూయేతరుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలన్న నిబంధనలను పాటించడం లేదంటూ ఆరోపణలు చేశారు.
తొలుత తమ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వినాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనాన్ని కోరగా ఈ స్పెషల్ లీవ్ పిటిషన్పై విచారణ స్వీకరించిన సందర్భంగా జస్టిస్ రమణ స్పందిస్తూ… ‘మీరు ఎక్కడి వారు?’ అని అడిగి తెలుసుకున్నారు.
తెలుగు వారమని తెలుపగా.. జస్టిస్ ఎన్వీ రమణ కూడా తెలుగులోనే మాట్లాడారు. “మీరు వెంకటేశ్వర స్వామి భక్తులైతే ఓపిగ్గా ఉండాలి. ప్రతి రోజూ పిటీషన్ను లిస్ట్ చేయమని రిజిస్ట్రీపై ఒత్తిడి తీసుకురాకూడదు. మేమందరం బాలాజీ భక్తులమే” అని చెప్పారు.
పిటీషన్ను వచ్చే బుధవారం లిస్ట్ చేస్తూ.. ఆచారాలలో అక్రమాలను ఆరోపిస్తూ శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తుల ఫిర్యాదుపై స్పందించాలని సుప్రీం కోర్టు బుధవారం తిరుపతి తిరుమల దేవస్థానాన్ని కోరింది. అసలు పిటిషనర్ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఏమైనా ఉందా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు వారం లోగా సమాధానం ఇవ్వాలని టీటీడీ న్యాయవాదికి ధర్మాసనం అవకాశం ఇచ్చింది.
More Stories
మంత్రికి వత్తాసు పలికారని కడప పోలీసులకు చార్జ్ మెమోలు
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన మీనా
ఏపీలో పెట్రోల్ బంక్లపై ఆంక్షలు