పీఎం-పోషణ్‌ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం

ప్రధానమంత్రి-పోషణ్‌ పథకానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. పథకం ద్వారా దేశవ్యాప్తంగా 11.2 లక్షలకుపైగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందనుంది. 

ఈ పథకం ఐదేళ్ల పాటు కొనసాగుతుందని, అమలు కోసం రూ.1.31లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు తెలిపారు. పీఎం-పోషణ్‌ పథకంతో ప్రస్తుతం ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్రం ఉపసంహరించుకోనుంది.

కేంద్రమంత్రి మాట్లాడుతూ రూ.1,095.88కోట్లతో నిమాచ్-రత్లం రైల్వే లైన్‌ డబ్లింగ్‌, రూ.1,080.58 కోట్లతో రాజ్‌కోట్-కనలుస్ రైల్వే లైన్ డబ్లింగ్‌కు మంత్రివర్గం ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు. ఎగుమతిదారులకు, బ్యాంకులకు సహకారం అందజేయడం కోసం ఐదేళ్లలో ఈసీజీసీ లిమిటెడ్‌లో రూ.4,400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు మంత్రివర్గం  అనుమతించినట్లు పేర్కొన్నారు. 

దీంతో ఫార్మల్ సెక్టర్‌లో 2.6 లక్షల కొత్త ఉద్యోగాలతో సహా మొత్తం మీద 59 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయన్నారు. నేషనల్‌ ఎక్స్‌పోర్ట్‌ ఇన్సూరెన్స్‌ అకౌంట్‌ స్కీమ్‌లో రూ.1,650 కోట్లు పెట్టడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.