తుఫాన్ తో ఉత్తరాంధ్ర జిల్లాలు అస్తవ్యస్తం… ఐదుగురు మృతి

గులాబ్‌ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో కుండపోత వర్షం కురిసింది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు ఎడతెగకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రాకపోకలు స్తంభించి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. 

విశాఖ జిల్లాలో అనూహ్యంగా 11.8 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో 8 సెం.మీ., విజయనగరం జిల్లాలో 8.9 సెం.మీ. సగటు వర్షం కురిసింది. విశాఖ నగరం, పరిసర ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షం పడింది. నగర శివారులోని టీటీడీ కల్యాణ మండపం వద్ద ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 8.30 వరకు 33.3 సెం.మీ. వర్షం కురిసింది.

గులాబ్‌ తుపాను ఐదుగురిని బలిగొంది. మృతుల్లో విజయనగరం జిల్లాకు చెందిన ముగ్గురు, విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నారు.వర్షాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోని 62 మండలాలపై తీవ్ర ప్రభావం చూపాయి. విశాఖ జిల్లాలో 32, శ్రీకాకుళం జిల్లాలో 15, విజయనగరం జిల్లాలో 15 మండలాలు వర్షాల ధాటికి విలవిల్లాడాయి. 

వీటి పరిధిలో మొత్తం 375 గ్రామాల్లో ఎడతెగని వర్షాలు కురిసినట్టు విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. 1,800కు పైగా ఇళ్లు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోగా విద్యుత్‌ శాఖ కొద్ది గంటల్లోనే పునరుద్ధరించింది.  వర్షానికి తోడు, మేహాద్రి గెడ్డ రిజర్వాయర్‌ గేట్లు ఎత్తేయడంతో వరద నీరు విశాఖ విమానాశ్రయంలోకి చేరింది. పాత, కొత్త టెర్మినళ్లలో మోకాలి లోతు నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసింది. జిల్లా వ్యాప్తంగా 361 కిలోమీటర్ల మేర నేలకొరిగిన చెట్లను అగ్నిమాపకశాఖ సిబ్బంది తొలగించి ప్రజా రవాణా వ్యవస్థను పునరుద్ధరించారు. ఒక్క బూర్జ మండలంలోనే 16 ఇళ్లు కూలిపోగా, కోటబొమ్మాళి ఇతర మండలాల్లోనూ ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు వంశధార, నాగవళి వరద ప్రవాహం క్రమేణా పెరుగుతోంది.

విజయనగరం జిల్లా అంతటా ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారు జాము వరకు వీచిన భీకర గాలులు, కురిసిన భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మక్కువ మండలం వెంకట బైరిపురం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి దుక్క సింహాచలం 50 గొర్రెలపాటు సీతానగరం మండలం కొత్తవలస ఆనకట్ట పరిధి సువర్ణముఖి నది ప్రవాహం మధ్యలో చిక్కుకున్నాడు. 

ఆనకట్టలోని పడుకు (రాయి)పై ఉన్న ఆయనను రక్షించేందుకు విశాఖ నుంచి హెలికాప్టర్‌ను రప్పించే ఏర్పాట్లు అధికారులు చేశారు. గాలుల తీవ్రతకు తీరప్రాంత మండలాలైన భోగాపురం, పూసపాటిరేగల్లో చెట్లు, విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. పలు గ్రామాలు జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. సుమారు 35 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. 

విశాఖ నగరం జివిఎంసి పరిధిలోని 88 లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలో నీరు చేరింది. మేఘాద్రి గెడ్డ పూర్తిగా నిండి గేట్లు ఎత్తివేయడంతో విశాఖ విమానాశ్రయం నీట మునిగింది. గ్రామీణ ప్రాంతాలోనూ, ఏజెన్సీలోనూ భారీ వర్షాలు పడ్డాయి. పంటలు నీట మునిగాయి.

గ్రామీణ ప్రాంతంలో 13 ప్రాంతాలలో చెట్లు విరిగి పడ్డాయని, 28 చోట్ల రోడ్లు మీద నీరు ప్రవహించిందని, సుమారు 289 కిలో మీటర్ల మేర రోడ్డు దెబ్బతిన్నాయని ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ తెలిపారు. అనంతగిరి మండలంలోని కెకె.లైన్‌పై బొర్రా, చిమిడిపల్లి 70/13-14-టిపి మార్గ మధ్యలో కొండచరి యలు విరిగిపడ్డాయి. అప్రమత్తమైన రైల్వే అధికారులు వాటిని తొలగించి రైళ్ల రాకపోకలు యథావిధిగా సాగేలా చేశారు.

తూర్పుగోదావరి గడిచిన 24 గంటల్లో 76.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. కడియంలో అత్యధికంగా 132.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 11 వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. 

పశ్చిమగోదావరి జిల్లాలో 95.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు జిల్లాలో 45,731 ఎకరాల్లో వరి, 118 ఎకరాల్లో పత్తి, 233 ఎకరాల్లో మినుము, 155 ఎకరాల్లో వేరుశనగ, 15 ఎకరాల్లో మొక్కజొన్న, పది ఎకరాల్లో చెరకు, వందలాది ఎకరాల్లో కూరగాయల పంటలు ముంపు బారిన పడ్డాయి.

కృష్ణా జిల్లాలో గడిచిన 24 గంటల్లో 44.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. 13 మండలాల్లో 15,849 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. గుంటూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజూము నుంచి మధ్యాహ్నం వరకు ఒక మోస్తరు వర్షం కురిసింది. అమరావతిలో అత్యధికంగా 42.4 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. మిర్చి పొలాల్లోకి నీరు చేరింది.