ఏపీ సర్కారు కొత్త అప్పుల కోసమే సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయించాలనుకుంటోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తులు తీసే సినిమాపై ప్రభుత్వ ఆధిపత్యం ఏమిటని ప్రశ్నించారు. తెలుగు సినిమా పట్ల ఏపీ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే… మారేలా ఎలా చేయాలో తనకు తెలుసని హెచ్చరించారు.
శనివారం హైదరాబాద్లో జరిగిన ‘రిపబ్లిక్’ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో పాల్గొంటూ కొత్త అప్పులకోసమే సినిమా పరిశ్రమ డబ్బును వాడుకోవాలని ప్రభుత్వం చూస్తున్నదని ధ్వజమెత్తారు. ‘ఏపీ సర్కారు వద్ద డబ్బుల్లేవని, సినిమా టికెట్ల డబ్బులు ఖజానాకు వెళితే… ఆ ఆదాయాన్ని బ్యాంకులకు చూపించి కొత్త అప్పులు తీసుకోవచ్చానుకొంటున్నదని విమర్శించారు.
సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై చర్చించడం మానేసి… నేర రాజకీయాలపై మాట్లాడాలని సూచించారు. ‘‘వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడండి. విశాఖలో, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని విమానాశ్రయంలో ఒక నాయకుడిపై కోడి కత్తితో దాడి జరిగింది కదా! దీని వెనుక భారీ కుట్ర ఉందని అప్పటి గవర్నర్ నరసింహన్ కూడా అన్నారు. ఆ కేసు ఏమైందో అడగండి” అంటూ ఏపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు.
లక్షలాది ఎకరాల పోడు భూములు గిరిజనులకు ఎందుకు దక్కడం లేదో… దారి గురించి మాట్లాడండి అంటూ హితవు చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడిన వాళ్లు వైసీపీ రాగానే ఎందుకు మాట్లాడటంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
‘‘రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారు? బోయలకు ఎందుకు రాజకీయ ప్రాతినిధ్యం లభించడంలేదు? ఇన్ని రకాల సమస్యలు పెట్టుకుని… సినిమా వాళ్లపైనే ఎందుకు మాట్లాడుతున్నారు?’’ అని పవన్ ప్రశ్నించారు. ఇడుపులపాయలో నేలమాళిగల్లో టన్నుల కొద్దీ డబ్బులుంటాయని అంటారని దానిమీద మాట్లాడాలని ఎద్దేవా చేశారు.
వైసీపీ ప్రభుత్వం తనపైన కోపంతో మొత్తం తెలుగు సినిమా పరిశ్రమను అడ్డుకుంటోందని పవన్ ఆరోపించారు. ‘‘నా సినిమాలు ఆపేస్తే భయపడిపోతారని వైసీపీ నాయకులు అనుకుంటున్నారు. నా పేరు చెప్పి ఇండస్ట్రీని చావగొడుతున్నారు’’ అని మండిపడ్డారు. తను హీరోగా ‘వకీల్సాబ్’ సినిమా నిర్మించిన దిల్ రాజును (సభలో ఆయన కూడా ఉన్నారు) ఉద్దేశించి… ‘‘దిల్ రాజుగారూ! మీరు నాతో సినిమా తీయకుంటే ఆంధ్రాలో సినిమాలను అడ్డుకునే వారు కాదు. మీరూ రెడ్డి, వారూ రెడ్డే కదా! మీరూ మీరూ తేల్చుకోండి. మమ్మల్ని బతికించండి’’ అని నవ్వుతూ అన్నారు.
సినిమా పరిశ్రమకు ఏపీలో జరుగుతున్న అన్యాయంపై పెద్దలంతా మాట్లాడాలని పవన్ సూచించారు. ‘సన్నాసి మంత్రి’ అంటూ పేర్ని నానిపై మండిపడ్డారు. ‘‘చిరంజీవి అంటే సోదర భావన అని ఆ సన్నాసి అంటారు. సోదిలో సోదర భావన… చిత్ర పరిశ్రమకు ఉపయోగపడని సోదర భావన ఎందుకు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ నాయకులు ఉపరాష్ట్రపతి వెంకయ్యపైనా నీచంగా మాట్లాడారు. భారత ప్రధాన న్యాయమూర్తిపైనే దాడులు చేశారు. వీళ్లకు సినిమా పరిశ్రమ ఒక లెక్కా? వారి లక్ష కోట్ల ముందు రెండు వేల కోట్ల విలువైన పరిశ్రమ ఎంత? అంటూ దుయ్యబట్టారు. ‘రిపబ్లిక్’ సినిమా తీయడమే కాదని… ఆ స్ఫూర్తిని కూడా ప్రదర్శించాలని పవన్ సూచించారు.
‘‘నేను గొడవ పడటానికి సిద్ధమయ్యే మాట్లాడుతున్నా. గూండాలు, క్రిమినల్ పొలిటీషియన్కు భయపడొద్దు. చిరంజీవి అలా ప్రాధేయపడతాడేమిటని అందరూ అంటారు. ఆయనది మంచి మనసు. అలా ప్రాధేయపడాల్సిన అవసరంలేదు. అందరూ ధైర్యంగా ప్రశ్నించాలి. గట్టిగా మాట్లాడాలి. సున్నితంగా ఉంటే ఎలా? ఇది మన హక్కు’’ అని పవన్ స్పష్టం చేశారు.
సీనియర్ నటుడు మోహన్బాబు కూడా ఏపీలో సినీ పరిశ్రమకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడాలని ఈ సందర్భంగా కోరారు. ‘‘మీరు బంధువులు కదా! చిత్ర పరిశ్రమను హింసించొద్దని చెప్పండి. ఇప్పుడు సినిమాలకు పెట్టిన నిబంధనలు రేపు మీ విద్యా నికేతన్ సంస్థలకూ వర్తింపచేయవచ్చు. ఇది అందరికీ వర్తిస్తుంది’’ అని హెచ్చరించారు.
More Stories
మోదీ పథకాలకు స్టిక్కర్ లతో జగన్ మోసం
వీవీప్యాట్లపై పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు
రమణ దీక్షితులుకు నోటీసు ఇచ్చి వివరణ తీసుకోండి