న‌రేంద్ర గిరి మృతిపై సిబిఐ ద‌ర్యాప్తు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అఖాడా ప‌రిష‌త్ అధ్య‌క్షుడు మ‌హంతి న‌రేంద్ర గిరి అనుమానాస్ప‌ద మృతిపై ద‌ర్యాప్తు చేప‌ట్టేందుకు సీబీఐ ఆరుగురు స‌భ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. కేసును ఉత్తరప్రదేశ్‌ పోలీసుల నుండి సిబిఐ తన ఆధీనంలోకి తీసుకుంది.

ప్ర‌యాగ్‌రాజ్‌లో ఉన్న బాఘంబ‌రి మ‌ఠంలో న‌రేంద్ర గిరి సోమవారం ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.  ప్రాథమిక శవపరీక్షలో ఆయన ఉరివేసుకోవడంతో ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సిఫార్సు మేరకు ఈ కేసు సిబిఐకి అప్పగించగా.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

యుపి పోలీసులు విచారణ చేపట్టిన దాని ప్రకారం  72 ఏళ్ల నరేంద్ర సోమవారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆయన రూమ్‌లోకి వెళ్లారు. సాయంత్రం తలుపులు కొట్టినా.. తీయకపోవడంతో అనుమానం వచ్చి, ఫోన్‌ చేయగా.. అన్సర్‌ చేయకపోవడంతో, తలుపులు పగలగొట్టి .. వెళ్లి చూడగా.. ఉరివేసుకుని కనిపించినట్లు పేర్కొన్నారు.

కాగా, గదిలో సూసైట్‌ నోట్‌ ఉన్నట్లు చెబుతున్నారు.అయితే సూసైడ్ నోట్‌పై అనుమానాలు వ్య‌క్తం కావ‌డంతో ఆయ‌న మ‌ర‌ణం ఓ మిస్ట‌రీగా మారింది. దీంతో ఈ కేసును సీబీఐకి అప్ప‌గించారు. మ‌హంతి న‌రేంద్ర గిరి మృతిపై ద‌ర్యాప్తు చేప‌ట్టేందుకు ఆరుగురు స‌భ్యుల సీబీఐ బృందం ప్ర‌యాగ్‌రాజ్ చేరుకోనున్న‌ది. మ‌రోవైపు ఈ మృతి కేసులోఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నస్వామి శిష్యులు  ఆనంద గిరి, ఆద్యా ప్ర‌సాద్ తివారీల‌ను స్థానిక కోర్టులో హాజ‌రుప‌రిచారు. ఆ ఇద్ద‌ర్నీ 14 రోజుల పాటు జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీలోకి పంపారు.

న‌రేంద్ర గిరి మృతిపై అనుమానాలు ఉన్న నేప‌థ్యంలో భాఘంబ‌రి ఘ‌డి మ‌ఠం వార‌సుడి నియామ‌కం విష‌యంలో జాప్యం జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి. న‌రేంద్ర గిరి కేసులో ద‌ర్యాప్తు ఆధారంగా త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఒక‌వేళ న‌రేంద్ర గిరి వ‌ద్ద ల‌భ్య‌మైన సూసైడ్ నోట న‌కిలీద‌ని తెలిస్తే, అప్పుడు మ‌ఠం స‌భ్యులు సంయుక్తంగా వార‌సున్ని ఎన్నుకుంటారు.