మత మార్పిడుల రాకెట్ కేసులో మౌలానా సిద్దిఖీ అరెస్ట్

ఇస్లామిక్ స్కాలర్, జామియా ఇమామ్‌ వలీవుల్లా ట్రస్ట్ నిర్వాహకుడు మౌలానా కలీం సిద్దిఖీ (64) ని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌ బుధవారం ఉదయం అరెస్ట్ చేశారు. ముజఫర్‌‌నగర్‌‌లో గతంలో బట్టబయలైన మత మార్పిడుల రాకెట్ కేసులో ఆయనను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

ఈ కేసులో జూన్‌ నెలలో ఏటీఎస్ ఉమర్‌‌ గౌతమ్‌ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేయగా.. కలీం సిద్దిఖీ పాత్ర గురించి పోలీసులకు వివరించాడు. కొద్ది రోజులుగా అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు మీరట్‌ వచ్చాడని పక్కా సమాచారంతో ఇవాళ అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా పోలీసులు ప్రెస్‌మీట్ పెట్టి కేసు వివరాలను వెల్లడించారు. 

సిద్దిఖీ స్వస్థలమైన ముజఫర్‌‌నగర్‌‌లో దేశంలోనే అతి పెద్ద మత మార్పిడి సిండికేట్‌ను గుర్తించామని తెలిపారు. ‘‘మౌలానా కలీం సిద్దిఖీ జామియా ఇమామ్‌ వలీవుల్లా ట్రస్ట్‌ నిర్వహిస్తూ విదేశాల నుంచి భారీగా ఫండ్స్ సేకరిస్తున్నాడు.  బెహ్రెయిన్‌తో పాటు పలు దేశాల నుంచి రూ.3 కోట్ల వరకూ విరాళాలను తీసుకున్నట్లు ఇన్వెస్టిగేషన్‌లో గుర్తించాం” అని తెలిపారు.

ఇలా సేకరిస్తున్న నిధులను వేర్వేరు మదార్సాలకు పంపిస్తున్నాడు. ఏటీఎస్ ఆఫీసర్లు ఆరు టీమ్స్‌గా ఏర్పడి ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏటీఎస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ జీకే గోస్వామి తెలిపారు. ముజఫర్‌‌నగర్ నుంచి పని చేస్తున్న ఈ మతమార్పిడుల సిండికేట్ దేశంలో వెయ్యి మంది వరకూ మతమార్పిడి చేసినట్లు ఆయన చెప్పారు.

సిద్దిఖీకి చెందిన ట్రస్ట్ కు బెహరాన్ నుండి రూ 1.5 కోట్లతో పాటు మొత్తం రూ 3 కోట్లు విదేశీ నిధులు వచ్చిన్నట్లు తేలినదని యుపి శాంతిభద్రతల అదనపు డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఇదే కేసులో ముఫ్తీ ఖ్వాజీ జహంగీర్ ఆలం ఖ్వాస్మీ, ఉమర్ గౌతమ్‌ను జూన్‌ నెలలో ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ ఐఎస్‌ఐ నుంచి డబ్బులు తీసుకుని ఢిల్లీ జామియా నగర్ ఏరియాలో వినికిడి లోపం ఉన్న విద్యార్థులు, పేద ప్రజలను మతం మార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై వీరిద్దరిని అరెస్ట్ చేశారు.