తెలంగాణాలో కేవలం కుటుంబ పాలన నడుస్తోంది 

తెలంగాణలో ప్రజా పాలన నడవడం లేదని, కేవలం కుటుంబ పాలన నడుస్తోందని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ ధ్వజమెత్తారు. సీఎం పీఠం ఎక్కగానే కేసీఆర్  హామీలను మర్చిపోయారని విమర్శించారు. ఏడేళ్ల పాలనలో ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కామారెడ్డి జిల్లాలో జరుగుతుండగా ఆయన పాల్గొంటూ తెలంగాణలో రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం ఏర్పడటం తధ్యమని భరోసా వ్యక్తం చేశారు. ప్రజల్ని మభ్యపెడుతోన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని పిలుపునిచ్చారు. 

రాష్ట్రంలో అవినీతి అక్రమాల పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంలో మోదీ  ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రాలకు నిధులు పెంచారని ఆయన తెలిపారు. తెలంగాణలో హైవేల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు.  యాత్ర ద్వారా ప్రజా సమస్యలను బండి సంజయ్ తెలుసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామని ప్రకాష్ జవదేకర్ ధీమా వ్యక్తం చేసారు.

ధనికరాష్ట్రమైన తెలంగాణను ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి తీసుకొచ్చారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రతీ పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయని, అయితే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేంద్రం ఏమీ చేయడంలేదని ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. 2023లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బండి ధీమా వ్యక్తం చేశారు. జిల్లాకు ఒక వంద పడకల ఆస్పత్రి అని చెప్పి ఇప్పుడు జిల్లాకు వంద మద్యం దుకాణాలు తెరుస్తున్నారని ఎద్దేవా చేశారు.