మజ్లీస్ కనుసైగల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్‌

17 సెప్టెంబర్ ను అధికారికంగా నిర్వహించకుండా కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రభుత్వాలు అన్యాయం చేశాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీ ముందున్న సర్థార్ పటేల్ విగ్రహానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు  నివాళులర్పించారు. 
 
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ  కేసీఆర్ తన తప్పును తెలుసుకొని అమరుల ఆత్మకు శాంతి చేకూర్చాలని డిమాండ్ చేశారు. రజాకార్ల నేత కాశిం రజ్వీ పెట్టిన పార్టీ ఎంఐఎం అని అన్నారు. మజ్లీస్ కనుసైగల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు పనిచేస్తున్నాయని  ధ్వజమెత్తారు. 
 
తెలంగాణ ఆత్మ గౌరవం.. ఆకాంక్షల సమస్య అని…మజ్లీస్ ఏది చెబితే అది అమలు అవుతుందని తెలిపారు. కేసీఆర్, ఒవైసీ కుటుంబాలు తెలంగాణ ప్రజలను తమకి బానిసలుగా ఉండాలని కోరుకుంటున్నాయని మండిపడ్డారు. సెప్టెంబర్ 17 అన్ని పార్టీలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.. కానీ ప్రభుత్వ పరంగా గ్రామ గ్రామాన జరగాలని డిమాండ్ చేశారు.
 
 కుహనా లౌకిక వాదులకి, ఓటు బ్యాంకు రాజకీయాలకు బుద్ధి చెప్పాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ వైఖరిని మజ్లీస్ దౌర్జన్యాన్ని ప్రజలు ఖండించాలని కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించే ఫైల్…రెండో సంతకం తెలంగాణ విమోచన చరిత్రను పాఠ్య పుస్తకాలలో పెట్టే ఫైల్‌పైన అని కిషన్ రెడ్డి వెల్లడించారు. 
 
మజ్లిస్ పార్టీకి లొంగి కేసీఆర్ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించడం లేదని బీజేపీ ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ విమర్శించారు. చరిత్ర వెలుగులోకి వస్తే మజ్లీస్‌కు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే పార్టీలకు రాజకీయ మనుగడ ఉండదని హెచ్చరించారు.
 
 ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చరిత్రను తెరమరుగు చేస్తున్నారని పేర్కొన్నారు. నిజాంకు, కేసీఆర్‌కు ఎలాంటి తేడా లేదని…ఊసర వెల్లిలా కేసీఆర్ రంగులు మారుస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ నియంతలా వ్యవహరుస్తున్నారని లక్ష్మణ్ దుయ్యబట్టారు.