గుజరాత్‌లో 24 మంది మంత్రుల ప్రమాణస్వీకారం

గుజరాత్‌ కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. మాజీ అసెంబ్లీ స్పీకర్‌ రాజేంద్ర త్రివేది, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు జితు వాఘని సహా 24 మంది మంత్రులుగా గురువారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ 24 మంది మంత్రులతో ప్రమాణం చేయించారు. 
 
గత ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన ఏ ఒక్కరికీ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ మంత్రివర్గంలో చోటివ్వలేదు. గవర్నర్‌ 10 మంది కేబినెట్‌ మంత్రులు, 14 మంది రాష్ట్ర మంత్రులతో ప్రమాణం చేయించారు. ఇందులో ఐదుగురు స్వతంత్ర బాధ్యతలు కలిగిన మంత్రులు ఉన్నారు. 
 
కేబినెట్‌ మంత్రులు బాధ్యతలు స్వీకరించిన వారిలో రాజేంద్ర త్రివేది, జీతు వాఘని, రుషికేష్ పటేల్, పూర్ణేష్ మోడీ, రాఘవ్‌జీ పటేల్, కనుభాయ్ దేశాయ్, కిరిత్సింహ్ రాణా, నరేశ్‌ పటేల్, ప్రదీప్ పర్మార్, అర్జున్‌సింగ్‌ చౌహాన్‌ ఉన్నారు. కార్యక్రమానికి సీఎం భూపేంద్ర పటేల్‌ హాజరయ్యారు.
 
భూపేంద్ర పటేల్ గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ రూపానీ కూడా పాల్గొన్నారు. మంత్రి పదవులు దక్కించుకున్న వారిలో నరేష్ పటేల్, జితు చౌదరి గిరిజన ఎమ్మెల్యేలు.   కాగా, భుజ్ ఎమ్మెల్యే నిమాబెన్ ఆచార్య గుజరాత్ కొత్త స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల ముందు రాజీనామా చేసిన స్పీకర్ రాజేంద్ర త్రివేదీకి కొత్త ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మంత్రివర్గంలో చోటు దక్కింది.