జీఎస్టీ కౌన్సిల్‌ ముందుకు జీఎస్‌టీలోకి పెట్రోల్‌, డీజిల్‌!

పెట్రోల్‌, డీజిల్‌పై దేశమంతటా ఒకే పన్ను విధించేలా జీఎస్టీ పరిధిలో చేర్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ రెండు ప్రధాన ఇంధనాలతో పాటు ఇతర పెట్రోలియం ఉత్పత్తులపై దేశవ్యాప్తంగా ఒకే పన్ను అమలుచేసే ప్రతిపాదనను సెప్టెంబర్‌ 17న జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం పరిశీలించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటూ డిమాండ్లు వస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌పై పన్నుపై పన్ను వేసే విధానానికి ముగింపుపలకాలంటే ఈ ఉత్పత్తులను జీఎస్టీలో చేర్చడమే పరిష్కారమని ఉన్నతస్థాయి అధికార వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ ఇంధనాల ఉత్పత్తి వ్యయంపైనే కాకుండా, కేంద్రం విధించే ఎక్సయిజు సుంకంపై కూడా రాష్ర్టాలు వ్యాట్‌ను వసూలుచేస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ను వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి చేర్చే నిర్ణయాన్ని తీసుకోవాలంటూ జూన్‌ నెలలో కేరళ హై కోర్టు జీఎస్టీ కౌన్సిల్‌ను కోరింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ అంశాన్ని వచ్చే జీఎస్టీ కౌన్సిల్‌ ముందు ఉంచనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

కేంద్రం, రాష్ట్రాలకు చెందిన డజనుకు పైగా పన్నులను విలీనం చేస్తూ 2017 జూలై 1 నుంచి జీఎస్‌టీ చట్టాన్ని అమలులోకి తెచ్చారు. అయితే, పెట్రోల్‌, డీజిల్‌, విమాన ఇంధనం (ఏటీఎఫ్‌), సహజ వాయువు, ముడి చమురును మాత్రం ఈ చట్టంలో చేర్చలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకివి ప్రధాన పన్ను ఆదాయ వనరులు కావడమే ఇందుకు ప్రధాన కారణం.

జీఎస్‌టీ ఆదాయాన్ని కేంద్రం, రాష్ట్రాలు సమానంగా పంచుకుంటున్నాయి. కానీ, పెట్రో ఉత్పత్తులపైన మాత్రం వేర్వేరుగా పన్నులు వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై రూ.32.80, డీజిల్‌పై రూ.31.80 ఎక్సైజ్‌ సుంకం వసూలు చేస్తోంది.

ఇంధనోత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే వీటిపై అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటి ఆదాయంలో భారీగా గండి పడుతుంది. ఈ కారణంగా కేంద్రం, రాష్ర్టాలు ఆదాయంపై రాజీపడాల్సి ఉంటుంది. ఈ ఉత్పత్తులపై వచ్చే భారీ పన్ను ఆదాయంపైనే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థితిగతులు ఆధారపడిఉన్నందున, అప్పట్లో జీఎస్టీ కౌన్సిల్‌ ఈ నిర్ణయాన్ని తీసుకున్నది.

కరోనా అత్యవసరాలపై పన్నుండదు

కొవిడ్‌-19 అత్యవసరాలపై పన్ను తగ్గింపు గడువును వచ్చే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం పొడిగిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన ఈ నెల 17న జరిగే సమావేశం వర్చువల్‌గా కాకుండా, భౌతికంగా జరుగుతుంది. ఈ 45వ జీఎస్టీ సమావేశం భౌతికంగా జరగడం 20 నెలల తర్వాత ఇదే ప్రథమం. రాష్ర్టాల ఆర్థిక మంత్రులు హాజరవుతారు.

జూన్‌ 12న గత కౌన్సిల్‌ సమావేశం వీడియో కాన్ఫెరెన్సింగ్‌ ద్వారా జరిగింది. రెమిడిసివిర్‌, టోసిలిజుమాబ్‌, ఆక్సిజెన్‌, ఆక్సిజెన్‌ కాన్సంట్రేటర్లు, ఇతర కొవిడ్‌ అత్యవసరాలపై సెప్టెంబర్‌ 30 వరకూ జీఎస్టీని తగ్గిస్తూ ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ తగ్గింపు డిసెంబర్‌ 31వరకూ పొడిగించవచ్చని భావిస్తున్నారు.

కొన్ని లోహాలపై జీఎస్టీని 18 శాతానికి, పునరుత్పాదక విద్యుత్‌ పరికరాలపై 12 శాతానికి పెంచే అంశాన్ని కౌన్సిల్‌ చర్చిస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అలాగే పొగాకు, పాన్‌మసాలా తదితర హానికారక ఉత్పత్తులపై సెస్‌ వసూలును కొనసాగించేందుకు నియమనిబంధనల్ని కూడా కౌన్సిల్‌ ఆ సమావేశంలో చర్చిస్తుంది.

జీఎస్టీ అనేది వినియోగంపై విధించే పన్ను అయినందున, ఆ ఇంధనాల్ని ఉత్పత్తి, దిగుమతి చేస్తున్న గుజరాత్‌ నష్టపోతుందని, ఉత్తరప్రదేశ్‌ వంటి అధిక వినియోగం కలిగిన రాష్ట్రం లబ్దిపొందుతుందని పన్ను నిపుణులు వివరిస్తున్నారు. వీటిని జీఎస్టీలోకి తీసుకురావడం కేంద్రం, రాష్ర్టాలు రెండింటికీ భారమైన వ్యవహారమేనని నిపుణులు చెబుతున్నారు.